పాట్నా: బీహార్కు చెందిన పేదల అకౌంట్లలో కోట్ల రూపాయలు డిపాజిట్ అవుతున్న ఘటనలు ఇటీవల వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి కేసు మరొకటి బయటపడింది. విపిన్ చౌహాన్ అనే రోజువారి కూలీకి అసలు బ్యాంక్ అకౌంట్ లేదు. అయితే మన్రేగా పనులు చేస్తున్న అతను.. అకౌంట్ ఓపెన్ చేసేందుకు సుపౌల్ పట్టణంలో ఉన్న యూనియన్ బ్యాంక్ కస్టమర్ ఔట్లెట్ పాయింట్కు వెళ్లాడు. అక్కడ అకౌంట్ ఓపెన్ చేద్దామనుకున్న ఆ కూలీ షాక్ తిన్నాడు. అతని ఆధార్ నెంబర్తో జత చేసి ఉన్న ఓ అకౌంట్లో 9.99 కోట్లు ఉన్నట్లు గుర్తించారు.
బ్యాంక్ ఖాతా తెరిచేందుకు విపిన్ ఆధార్ నెంబర్ తీసుకున్న సీఎస్పీ ఔట్లెట్ సిబ్బంది.. ఆ డేటాను ఎంటర్ చేసిన తర్వాత ఖంగు తిన్నారు. విపిన్ చౌహాన్ పేరుతో ఇంతకుముందే అకౌంట్ ఉన్నట్లు గుర్తించారు. అది సేవింగ్స్ అకౌంట్ అని, దాంట్లో రూ.9.99 కోట్లు డిపాజిట్ అయి ఉన్నట్లు తేల్చారు. అయితే బ్రాంచ్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన విపిన్ తన పేరిట ఉన్న అకౌంట్ డిటేల్స్ కోసం ఆరా తీశాడు. 2016, అక్టోబర్ 13న ఆ అకౌంట్ను ఓపెన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 2017లో ఆ అకౌంట్ నెంబర్లో కోట్లల్లో అమౌంట్ను డిపాజిట్ చేశారు. కానీ బ్యాంక్ అధికారులు వద్ద విపిన్ ఫోటో కానీ, సంతకం కానీ, వేలిముద్ర కానీ లేదు. కేవలం ఆధార్ కార్డు నెంబర్ మాత్రమే ఉన్నది. ఆ అకౌంట్లో ఇప్పటికీ రూ.9.99 కోట్లు ఉన్నట్లు చౌహాన్ చెప్పాడు.
అకౌంట్ ఓపెనింగ్ ఫారమ్ కోసం అధికారులు గాలింపు చేపట్టినా ఆ ఫారమ్ దొరకలేదు. ప్రస్తుతం ఆ అకౌంట్ను సీజ్ చేసినట్లు బ్యాంక్ అధికారులు చెప్పారు. ప్రస్తుతం అంతర్గతంగా విచారణ చేపడుతున్నామని, ఈ అకౌంట్ నెంబర్తో మరేమైనా లావాదేవీలు జరిగాయా అని దర్యాప్తు చేస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ అధికారి చెప్పారు.
ఇటీవల ముజాఫర్పూర్ జిల్లాకు చెందిన రామ్ బహదూర్ షా అకౌంట్లో రూ.52 కోట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఖతిహార్ జిల్లాలో ఇద్దరు స్కూల్ స్టూడెంట్ల అకౌంట్లలోనూ కోట్ల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. రంజిత్ దాస్ అనే వ్యక్తి అకౌంట్లోకి 5.5 లక్షలు డిపాజిట్ అయ్యాయి. అయితే ఆ డబ్బును తిరిగి ఇచ్చేందుకు అతను నిరాకరించాడు. దాంతో అతనిపై కేసు నమోదు చేసి జైల్లో వేశారు.