రెండు దశాబ్దాలకు పైగా సాగిన టీఆర్ఎస్ ప్రస్థానం ఇప్పుడు సరికొత్త దిశగా సాగుతున్నది. దేశ బలోపేతం కోసం ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నది. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. జాతి హితం కోసం టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్ విజయ దశమి రోజున ప్రకటించారు. తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తం చేసేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తొలి నాళ్ల నుంచి వెన్నంటి నడిచిన ఇందూరు ప్రజలు.. ఇప్పుడు కూడా ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. విద్వేషపు విచ్చుకత్తుల విధ్వంసంతో నలిగి పోతున్న దేశాన్ని బాగు చేయ బయల్దేరిన ఉద్యమ సారథి వెన్నంటి నడుస్తామని చెబుతున్నారు.
ముప్కాల్/బాన్సువాడ రూరల్, అక్టోబర్ 6 : తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితికి జనం తొలి నుంచి మద్దతుగా నిలిచారు. ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ వెన్నంటి నడిచారు. బ్యాలెట్ పోరులోనూ బాసటగా నిలిచి తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించారు. ఉద్యమ సారథి, సీఎం కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతో పోరుబాటలో ముందడుగు వేశారు. ఫలితంగా ఆరు దశాబ్దాలుగా కలగా మిగిలి పోయిన తెలంగాణ.. కేసీఆర్ పోరాట పటిమతో సాకారమైంది. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బలోపేతం చేసే దిశలోనూ ప్రజలు చంద్రశేఖరుడికే జైకొట్టారు. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగ్విజయాలను కట్టబెట్టారు. ఇప్పుడు దేశాన్ని బాగు చేసేందుకు వెళ్తున్న కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. ఆయన నిర్ణయానికి మద్దతు తెలిపిన ఉమ్మడి జిల్లా ప్రజలు.. జాతి హితం కోసం ప్రగతి రథ సారథి వెంట నడుస్తామని చెబుతున్నారు.
ఆది నుంచి అండగా..
తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన టీఆర్ఎస్కు తొలి నుంచి ఉమ్మడి జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన కేసీఆర్కు అడుగడుగునా మద్దతుగా నిలిచారు. అదే సంవత్సరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీకి చరిత్రాత్మక విజయాలు కట్టబెట్టారు. ఫలితంగా అనేక మండల పరిషత్లతో పాటు జిల్లా పరిషత్ పీఠాన్ని సైతం టీఆర్ఎస్ దక్కించుకుంది. అక్కడి నుంచి మొదలైన జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఉద్యమ కాలంలో కేసీఆర్ వెన్నంటి నడిచిన ఉమ్మడి జిల్లా ప్రజలు.. రాష్ట్ర సాధనలో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదించారు. తెలంగాణ సిద్ధించాక కూడా కేసీఆర్ చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ప్రజలు వెన్నంటి నడిచారు. ప్రత్యేక రాష్ట్రంలో రెండు సార్లు జరిగిన శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారు. స్థానిక సంస్థల్లోనూ అప్రతిహత విజయాలు కట్టబెట్టారు.
ఆదర్శంగా నిలిచిన తెలంగాణ మోడల్
కొత్తగా ఏర్పడిన రాష్ర్టాన్ని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో గద్దెనెక్కిన ఆయన.. తెలంగాణను దేశంలోనే నంబర్వన్గా నిలిపారు. సంక్షేమం, అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశానికి దిక్సూచిగా మార్చారు. వినూత్న పథకాల అమలుతో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు.. ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి బాటలు వేశారు. రాష్ట్రంలో సంపదను సృష్టించడమే కాకుండా సంక్షేమ ఫలాలను పేదల చెంతకు చేర్చారు. ఈ తరుణంలో తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణను చూసి ఇతర రాష్ర్టాల ప్రజలు తమకూ కేసీఆర్ నాయకత్వం అవసరమని భావించారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ప్రజలైతే తమను తెలంగాణలో కలపాలని ఎన్నోసార్లు విన్నవించారు.
బీఆర్ఎస్కు మద్దతుగా..
తెలంగాణలో సంక్షేమ పాలన కొనసాగుతుంటే, దేశంలో విద్వేష రాజకీయాలు పెచ్చరిల్లాయి. కుల, మత ప్రాతిపదికన సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆగడాలు మితిమీరాయి. నిధులు ఇవ్వకుండా రాష్ర్టాలను ఇబ్బందులకు గురి చేయడం పరిపాటిగా మారింది. అభివృద్ధిలో దూసుకు పోతున్న తెలంగాణకు అడుగడుగునా మోదీ సర్కారు ఆటంకాలు కల్పిస్తున్నది. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోక పోవడం, ధరల పెరుగుదలను నియంత్రించక పోవడం వంటి చర్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. దేశంలో అరాచకం పెరిగి పోతున్న వేళ.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జాతీయ రాజకీయాల వైపు అడుగులు ప్రారంభించారు. ఫలితంగా తెలంగాణ సాధన కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇప్పుడు దేశ ప్రగతి కోసం భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు బీఆర్ఎస్ ఏర్పాటును సాదరంగా స్వాగతిస్తున్నారు. కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తూ ఆయన వెంటే తామంతా ఉన్నామని మద్దతు పలుకుతున్నారు.
బీఆర్ఎస్తోనే దేశాభివృద్ధి : ఎమ్మెల్యే షిండే
నిజాంసాగర్, అక్టోబర్ 6: బీఆర్ఎస్తోనే దేశాభివృద్ధి సాధ్యమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. జుక్కల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దసరా వేడుకల సందర్భంగా నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన నాయకులు, కార్యకార్తలతో గురువారం మాట్లాడారు. విజయదశమి రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా ప్రకటించడం దేశంలోఒక చరిత్రాత్మక నిర్ణయమని అన్నారు. దేశంలోని రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్ వెంటే ఉన్నారని అన్నారు. తెలంగాణలో ఉన్న పథకాలు ఇప్పుడు దేశానికి ఎంతో అవసరమని అన్నారు. అన్ని రాష్ర్టాలు తెలంగాణ పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని బీఆర్ఎస్ తిరుగులేని జాతీయ పార్టీగా అవతరించడం ఖాయమన్నారు. భారతదేశానికి కేసీరా లాంటి దమ్మున్న నాయకుడు అవసరమని పేర్కొన్నారు. అనంతరం పటాకులు కాల్చుతూ బీఆర్ఎస్ పార్టీకి స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు సాయాగౌడ్, నీలూపటేల్, మాధవ్రావ్దేశాయ్, బొల్లిగంగాధర్, రాములు, దుర్గారెడ్డి, మనోహర్, రమేశ్గౌడ్, విఠల్, కాశయ్య, మహేందర్, ఇఫ్తాకర్, రామాగౌడ్, నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దేశాన్ని గాడిలో పెట్టే సత్తా కేసీఆర్కే ఉంది
దేశం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించడం దేశ రాజకీయాలను మలుపు తిప్పే గొప్ప నిర్ణయం. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను ధనికుల చేతిలో పెడుతున్న ప్రస్తుత తరుణంలో పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కేసీఆర్ టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా ప్రకటించడం హర్షణీయం. దేశాన్ని గాడిలో పెట్టే సత్తా కేసీఆర్కే ఉంది.
– బోనాల సుభాష్, సర్పంచ్, హన్మాజీపేట్.
సంక్షేమ పథకాలే సీఎం కేసీఆర్కు శ్రీరామ రక్ష
సీఎం కేసీఆర్ సార్ బీఆర్ఎస్ పేరు మీద జాతీయ పార్టీని పెట్టడం మహిళలకు శుభసూచకం. ఆయన రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలే దేశాన్ని ఏలేందుకు శ్రీరామ రక్షగా నిలువనున్నాయి. సీఎం సార్ చేసిన జాతీయ పార్టీ ప్రకటనపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతి సీఎం కేసీఆర్తోనే సాధ్యం.
– మన్నె సునీత, గృహిణి, బోర్లం.
జాతీయ పార్టీ ప్రకటనతో అన్ని వర్గాల ప్రజల హర్షం
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ జాతీయ పార్టీని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఆయన నిబద్ధత గల నాయకుడు. జాతీయ పార్టీని పెట్టడంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఆయన సేవలు దేశానికి అవసరం. రాష్ట్రంలో ఇంటింటికీ చేరుతున్న సంక్షేమ ఫలాలు దేశంలోని ప్రజలందరికీ అందుతాయి.
– లక్ష్మణ్ గౌడ్, కల్లుగీత కార్మికుడు, బోర్లం.
దేశానికి సీఎం కేసీఆర్ రోల్ మోడల్
సీఎం కేసీఆర్ వినూత్న పథకాలతో తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా నిలిపారు. దేశం మొత్తం ఇలాంటి పథకాలు కావాలి. బీఆర్ఎస్ జాతీయ పార్టీకి వివిధ రాష్ర్టాల మద్దతు కచ్చితంగా ఉంటుంది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో రానున్న రోజుల్లో దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి.
– ప్రశాంత్, నాగంపేట్
ముందు చూపు ఉన్న నేత కేసీఆర్
కేసీఆర్ లాంటి ముందుచూపున్న నేత దేశరాజకీయాల్లోకి రావడం శుభసూచకం. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటుతో తెలంగాణ రైతులకు దగ్గరయ్యాడు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడంతో ఇటువంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలవుతాయి.
– శంకర్, రైతు, ముప్కాల్