నిజామాబాద్ క్రైం, జూలై 19 : జల్సాల కోసం సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశా రు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వీరు ముఠా ఏర్పడి రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని విలువైన స్మార్ట్ ఫోన్లు దొంగలించడమే పనిగా పెట్టుకున్నారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు తెలిపారు. కమిషనరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఠాకు సంబంధించిన వివరాలను ఆయ న వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్, హమాల్వాడి ప్రాంతాలకు చెందిన ఐదుగురు యువకులు ఓ గ్యాంగ్గా ఏర్పడి స్థానిక వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రద్దీగా ఉండే గంజ్, కుమార్ గల్లీ, మార్కెట్ ఏరియాల్లో తిరుగుతూ విలువైన సెల్ఫోన్లను దొంగలించారన్నారు. అంతే కాకుండా బైక్లపై సెల్ఫోన్లో మాట్లాడు తూ వెళ్లే వారిని వెంబడించి ఫోన్లు లాక్కొని పారిపోతుంటారని తెలిపారు.
దొంగిలించిన ఫోన్లను ఇతరులకు విక్రయిస్తూ జల్సాలు చేస్తారన్నారు. నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ పర్యవేక్షణలో వన్టౌన్ ఎస్హెచ్వో డి.విజయ్ బాబు ఆధ్వర్యంలో ఎస్సై శ్రావణ్ కుమార్ సిబ్బంది ఎంఏ షకీల్, రమణ కుమార్, నిషిత్, స్వామి, రాజేంద్రసాద్ మంగళవారం నగరంలోని శ్రీదేవి థియేటర్ వద్ద ఐదుగురు నిందితులతో పాటు ఓ మైనర్ను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు. వారి వద్ద నుంచి 22 సెల్ఫోన్లు, రెండు బైక్లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఐదురుగు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడంతో పాటు బాలుడిని జువెనైల్ హోమ్కు పంపించినట్లు సీపీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన సిబ్బందిని ఈ సందర్భంగా సీపీ అభినందించారు.