భిక్కనూర్, అక్టోబర్ 1: అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఇందుకు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనమన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలో రూ.5.55 కోట్లతో నిర్మించిన ఫోర్లేన్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎనిమిదేండ్లలో కామారెడ్డి నియోజకవర్గానికి రూ. 58 కోట్ల 26 లక్షలు మంజూరుకాగా, ఇందులో నుంచి 8 కోట్ల 23 లక్షలతో భిక్కనూర్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. 85 శాతం గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను నిర్మించినట్లు చెప్పారు. ఇటీవల కొందరు నేతలు గ్రామాల్లో తిరుగుతూ ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అంటున్నారని, రెండుసార్లు మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత విద్యుత్, ఉచిత బీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ఎందుకు ప్రవేశపెట్టలేదో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. గుజరాత్కు చెందిన 50 మంది కోసం రూ.10 లక్షల కోట్లను ప్రధాని మోదీ మాఫీ చేశారని ఆరోపించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని నీచ బుద్ధి పార్టీ బీజేపీ అని ఘాటుగా విమర్శించారు.
సర్పంచ్ తునికి వేణు, మాజీ సర్పంచ్ నాగభుషణం గౌడ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్కుమార్ ఎంపీపీ గాల్ రెడ్డి, జడ్పీటీసీ పద్మ, ఏఎంసీ చైర్మన్ భగవంత్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ నరేశ్, ఎంపీటీసీలు చంద్రకళ,సువర్ణ, బాబు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాంచంద్రం, అయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.