నిజామాబాద్ క్రైం, సెప్టెంబర్ 22: జిల్లా కేంద్రంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేవలం 48 గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించడం గమనార్హం. నిందితుడు స్థానిక శివాజీ చౌక్ ప్రాంతానికి చెందిన తివాడి యష్ (స్టీల్ షాపు వర్కర్) అనే వ్యక్తిగా గుర్తించారు. ఇందుకు సంబంధించి కేసు వివరాలను నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. స్థానిక సుభాష్ నగర్ కు చెందిన వృద్ధురాలు కొండ గంగాలక్ష్మి ఇంటికి ఈ నెల 19న తివాడి యష్ కొరియార్ బాయ్గా వచ్చాడు.
వృద్ధురాలి మెడలోంచి నాలుగు తులాల బంగారు పుస్తెల గొలుసు, మూడు తులాల బంగారు నల్లపూసల తాడు తెంచుకొని పరారయ్యాడు. చోరీపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. త్రీ టౌన్ ఇన్చార్జి ఎస్సై నరేశ్ నాయక్ కేసు నమోదు చేసుకున్నారు. ఇన్చార్జి సీఐ పి.శ్రీశైలం ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి కేవలం 48 గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడి నుంచి బంగారంతో పాటు యాక్టివా ద్విచక్ర వాహనాన్ని సైతం సీజ్ చేసినట్లు వెల్లడించారు. కేసు ఛేదించడంలో ముఖ్యపాత్ర వహించిన సీఐ శ్రీశైలం,ఎస్సై నరేశ్,సిబ్బంది వెంకట్ రామ్, అఫ్సర్ను ఏసీపీ అభినందించారు.