కమ్మర్పల్లి, సెప్టెంబర్ 22: బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు కానుకగా ఏటా చీరెలను అందజేస్తున్నది. 2017లో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు సారెను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరో విడుతగా జిల్లా ఆడబిడ్డలకు కానుకగా సీఎం కేసీఆర్ పంపిన చీరెలు మండలాలకు చేరుకున్నాయి. గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరీ, గ్రామ మహిళా సమాఖ్య సభ్యులు, రేషన్ డీలర్ల సమన్వయంతో బతుకమ్మ చీరెలను పంపిణీ చేయనున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, ఏపీఎంలతో కూడిన కమిటీ పర్యవేక్షించనున్నది. బతుకమ్మ చీరెల పంపిణీలో గ్రామ ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆహారభద్రత కార్డులో పేరు ఉండి 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బతుకమ్మ చీరెలను అధికారులు అందజేయనున్నారు. నిజామాబాద్ జిల్లాకు ఇప్పటికే 3లక్షల11వేల605 చీరెలు వచ్చాయని, అవసరమైతే మరిన్ని చీరెలు వచ్చే అవకాశమున్నదని డీఆర్డీవో చందర్ నాయక్ తెలిపారు. నేటి నుంచి ప్రారంభమయ్యే చీరెల పంపిణీ కార్యక్రమం ఈ నెల 30లోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీ శుక్రవారం ప్రారంభం కానున్నది. దేశమే అబ్బురపడేలా రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, వితంతు పింఛన్, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు పింఛన్, అమ్మఒడి, మహిళా సంఘాలకు భారీగా రుణాలు, స్వయం ఉపాధి రుణాలు, తదితర కార్యక్రమాలు అందిస్తున్న సీఎం కేసీఆర్.. బతుకమ్మ పండుగకు సర్కారు సారె అందిస్తుండడంతో మహిళల పట్ల ప్రత్యేక ప్రేమను చాటుతున్నది.
నేడు కమ్మర్పల్లిలో ప్రారంభం
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మహిళలకు దసరా కానుకగా సీఎం కేసీఆర్ సర్కారు అందిస్తున్న సర్కారు సారె ఆరో విడుత పంపిణీని కమ్మర్పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ప్రారంభించనున్నారు. మండల కేంద్రంలోని లలితా గార్డెన్లో మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.