ఇందూరు, సెప్టెంబర్ 22 : జిల్లాకు నూతనంగా బీసీ రెసిడెన్సియల్ డిగ్రీ మహిళా కళాశాల, బీసీ రెసిడెన్సియల్ బాలుర పాఠశాల, కామారెడ్డి జిల్లాకు బీసీ బాలికల రెసిడెన్సియల్ స్కూల్స్ మంజూరు కావడంపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
నూతనంగా మంజూరైన రెసిడెన్సియల్ మహిళా డిగ్రీ కళాశాల, బాలుర పాఠశాలను నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల పేద విద్యార్థులు ఉన్నతమైన, నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యనభ్యసించాలనేదే సీఎం కేసీఆర్ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్స్ 296 ఉండగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ 542 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గతంలో 161 బీసీ రెసిడెన్సియల్ స్కూల్స్ ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాటిని 280కి పెంచారని గుర్తు చేశారు. వీటిలో చాలా స్కూల్స్ ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై సుమారు రూ.1.20 లక్షలు ఖర్చు పెడుతూ విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యను అందిస్తోందని పేర్కొన్నారు. అడగగానే మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్కు ఉమ్మడి జిల్లా ప్రజల పక్షాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు.