భిక్కనూర్, ఆగస్టు15: కేసులు నమోదు కాని గ్రామంగా ర్యాగట్లపల్లి ఆదర్శంగా నిలిచిందని, ఈ గ్రామాన్ని మిగతా గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా జడ్జి శ్రీదేవి అన్నారు. సోమవారం ర్యాగట్లపల్లిలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సదస్సు నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రామంలో జిల్లా జడ్జి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో ఒకే ఒక కేసులో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి కేసును కొట్టి వేశారు.
ఆమె మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కాని ర్యాగట్లపల్లిలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. రోడ్డు ప్రమాదంపై నమోదైన కేసులో ఇరు వర్గాలు రాజీపడి తమకు తాము తీర్పు ఇచ్చుకోవడం సంతోషకరమని, ఇలాంటి తీర్పును ఎవరూ మార్చలేరని అన్నారు. తీర్పును రికార్డుల్లో భద్ర పరుస్తామని తెలిపారు. అనంతరం డీఎస్పీ సోమనాథం మాట్లాడుతూ గ్రామంలో 100 శాతం అక్షరాస్యత సాధించేలా కృషి చేయాలని పంచాయతీ పాలకవర్గాన్ని కోరారు. అనంతరం భిక్కనూర్ లయన్స్ క్లబ్ తరఫున సీనియర్ న్యాయవ్యాది గజ్జెల భిక్షపతి ర్యాగట్లపల్లి ప్రభ్వుత పాఠశాల అభివృద్ధికి రూ.10,000 అందిస్తామని ప్రకటించారు.
కామారెడ్డికి చెందిన న్యాయవ్యాది జగన్నాథం పాఠశాల అభివృద్ధికోసం రూ.5000 ఉపాధ్యాయులకు అందించారు. కార్యక్రమంలో అదనపు జడ్జి శ్రీనివాస్ నాయక్, ఇన్చార్జి సర్పంచ్ అనసూయ, బార్ అసోసియేషన్ అధ్యక్షడు అమృతరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నందరమేశ్, న్యాయవాది శ్రీధర్, సీఐ తిరుపతయ్య, ఎస్సై అనంద్ గౌడ్, నాయకులు మల్లారెడ్డి, నీలంరెడ్డి, సిద్దరాంరెడ్డి, నరేందర్ రెడ్డి, రక్షక్రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.