నిజామాబాద్ క్రైం, జూలై 21: పాత నేరస్తులు తీరుమార్చుకోలేదు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకొని 60 వరుస దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్తుడిని గతంలో పోలీసులు అరెస్టు చేశారు. పీడీ యాక్ట్ శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలై వచ్చిన నేరస్తుడు పద్ధతి మార్చుకోలేదు. మరో ఇద్దరు నేరస్తులతో కలిసి మళ్లీ దొంగతనలకు పాల్పడ్డాడు. స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ ఇంటికి కన్నం వేసిన దొంగలు చివరికి పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసు కమిషనరేట్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ నాగరాజు వివరాలను వెల్లడించారు.
నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన బొమ్మెర్ల. సోమేశ్(28) గతంలో ఉమ్మడి జిల్లాలో 60 దొంగతనాలు చేసి, జైలు శిక్ష అనుభవించాడు. పాత నేరస్తులైన మిర్చీ కౌంపౌండ్కు చెందిన సెట్టియర్ అలియాస్ సుబ్బయ్య(29) తోపాటు పడమటి అలియాస్ పరమటి(30) గతంలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లివచ్చారు. సోమేశ్, సుబ్బయ్య, పరమటి ఈ ముగ్గురు కలిసి మళ్లీ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు.
ఈనెల 15న సుభాష్నగర్ ఓల్డ్ ఎన్జీవోస్ కాలనీలో కానిస్టేబుల్ ఇంటి తాళం పగులగొట్టి 24 తులాల బంగారు నగలను దోచుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గురువారం ఉదయం 6గంటల సమయంలో నగరంలోని హమాల్వాడి పరిధిలోని పంబౌలి ఏరియాలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.12 లక్షల 64 వేల 500 విలువ చేసే 26 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు కృషిచేసిన ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ కృష్ణ వెకంటేశ్, ఎస్సై సాయినాథ్, సిబ్బంది అఫ్సర్, వెంకట్రామ్, సీసీఎస్ సిబ్బందిని సీపీ అభినందించారు.
ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు
దొంగతనాలు చేస్తూ జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ నడవడి మార్చుకోలేక మళ్లీ అలాంటి చర్యలకే పాల్పడుతున్న నేరస్తులపై కఠినంగా వ్యవహరించనున్నట్లు సీపీ నాగరాజు వెల్లడించారు. దొంగతనం కేసులో గురువారం పట్టుబడిన ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.