పసుపు బోర్డు విషయంలో ఆది నుంచి ఎంపీ అర్వింద్ కల్లబొల్లి మాటలు చెబుతూ వస్తున్నారు. పసుపు రైతుల ఓట్లతో ఎంపీగా గెలిచి మూడేండ్లు గడుస్తున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. పసుపు బోర్డు విషయం గురించి ఎవరైనా అడిగితే చిర్రెత్తిపోతున్నారు. రైతులకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారు. కడుపు మండిన రైతులు అర్వింద్ను నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రస్తుతం కొత్త రాగం ఎత్తుకున్నారు. పసుపు రైతులు తనకు ఓటే వేయలేదని, తనపై ఎన్నికల్లో పోటీ చేసిన రైతులకే ఓట్లు వేశారని చెబుతున్నారు. రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో రైతులు తనకు ఓటెయ్యలేదనే వాదనను తెర మీదికి తెచ్చినట్లు తెలుస్తోంది. బోర్డు హామీని నిలబెట్టుకోలేక ఎంపీ అర్వింద్ పసుపు రైతులను హేళన చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తుండడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజామాబాద్, జూలై 31, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓడెక్కేదాక ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడి మల్లన్న.. అన్న చందంగా మారింది నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ తీరు. 2019 సాధారణ ఎన్నికల్లో పసుపు రైతులే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరించిన ఆయన.. ఇప్పుడు వారినే హేళన చేసేలా మాట్లాడుతున్నారు. రైతులను రెచ్చగొట్టి, లేనిపోని మాటలతో మచ్చిక చేసుకున్నారు. బీజేపీకి ఓటేస్తే నిజామాబాద్ జిల్లాకు ఐదు రోజుల్లోనే పసుపు బోర్డును తీసుకు వస్తానంటూ నమ్మబలికారు. ఎన్నికల ప్రచారం, ప్రతి సభలోనూ ఇదే మాటను వల్లించాడు. బీజేపీ అగ్ర నేతలతోనూ ప్రకటనలు చేయించాడు. పసుపు పంటకు కనీస మద్దతు ధరను సైతం తీసుకువస్తానంటూ గొప్పలు చెప్పారు. ఎన్నికల్లో పసుపు రైతుల ఓట్లతో గెలిచి, ఇప్పుడు ఎంపీగా మూడేండ్లు దాటినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదు. పసుపు బోర్డు ఏమైందని ఎవరన్నా అడిగితే అడ్డదిడ్డంగా సమాధానాలతో దాటవేస్తున్నారు. పైగా ఈసారి కొత్తగా మరో పల్లవిని ఎత్తుకున్నారు. పసుపు రైతులు తనకు ఓటే వేయలేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన రైతులకే పసుపు రైతులు ఓట్లేశారని, బీజేపీకి వేయలేదంటూ చెప్పుకొస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పసుపు బోర్డు హామీని నిలబెట్టుకోలేక ఎంపీ అర్వింద్ బొక్కబోర్లా పడ్డాడు. ఈ విషయంపై రైతులు ఆగ్రహంతో ఉండడంతో హామీని పక్కదారి పట్టించేం ప్రయత్నంలో ఉన్నట్లు అర్థం అవుతున్నది.
రైతులపై మరో ఫేక్ ప్రచారం..
పసుపు బోర్డు ఏర్పాటు నిజామాబాద్ రైతుల చిరకాల వాంఛ. రెండున్నర దశాబ్దాలుగా జిల్లాలో బోర్డు ఏర్పాటు కోసం రైతులు ఉద్యమిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలు.. ఏండ్లపాటు మాయమాటలతో రైతులను నిలువునా ముంచుతున్నాయి. 2019 సాధారణ ఎన్నికల సమయంలో నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే పసుపు బోర్డు తథ్యమని ప్రకటనలు చేశారు. ధర్మపురి అర్వింద్ తన ఎన్నికల ప్రచారంలో ఒకడుగు ముందుకేసి తాను గెలిస్తే ఏకంగా ఐదు రోజుల్లోనే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానంటూ బాండ్ పేపర్ సైతం రాసిచ్చాడు. తీరా గెలిచి మూడేండ్లు అవుతున్నా రైతులను మోసగిస్తూ పబ్బం గడుపుతున్నారు. ఎన్నికల్లో హామీలు గుప్పించిన అర్వింద్సహా బీజేపీ పెద్దలెవ్వరూ పసుపు బోర్డు అంశాన్ని కనీసం ప్రస్తావించడంలేదు. పసుపు బోర్డు అంశమే తమ పరిధిలో లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పినప్పటికీ ఇదేంటని అడగడం లేదు. రైతులకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారు. అర్వింద్కు నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో పసుపు రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో రైతులు తనకు ఓటెయ్యలేదనే వాదనను తెర మీదికి తెచ్చినట్లు స్పష్టమవుతున్నది.
స్పైసెస్ బోర్డు 2017 నాటిదే..
ఎంపీ ధర్మపురి అర్వింద్ మళ్లీ పాత పాటనే అందుకున్నారు. ఫిబ్రవరి, 2020లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన స్పైసెస్ బోర్డు రీజినల్ కార్యాలయం ప్రకటనను తన గొప్పతనంగా చిత్రీకరిస్తున్నారు. రైతులందరూ పసుపు బోర్డు కావాలని కోరుకుంటే రీజినల్ ఆఫీస్, ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటుతోనే అర్వింద్ చేతులు దులుపేసుకున్నారు. వాస్తవానికి స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటర్ అనేది 2017లోనే కేంద్రం ప్రకటన చేసింది. వాస్తవానికి నాడు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత కృషికి దక్కిన ఫలితమది. పసుపు రైతులకు బోర్డు ఏర్పాటు తప్ప మిగిలిన ఏ అంశాలూ సంతృప్తిపర్చలేవని ఖరాకండిగా లోక్సభలోనే కవిత వెల్లడించారు. కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరించి బోర్డు కోసం తీవ్రంగా పోరాటం చేశారు. ఇప్పుడు అదే ఎక్స్టెన్షన్ ఆఫీస్ను నిజామాబాద్లో ఏర్పాటు చేస్తే.. ఇదంతా తన గొప్పతనంగా అర్వింద్ చెప్పుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. పసుపు రైతులకు లాభం చేకూరాలంటే బోర్డు తప్ప ఇతర ఎక్స్టెన్షన్ కార్యాలయాలతో ప్రయోజనం ఏమీ లేదని టీఆర్ఎస్ పార్టీ సైతం మొదట్నుంచి భావిస్తోంది. 2017లో చేసిన ప్రకటన మేరకు 2020 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఆఫీసు ఏర్పాటు చేసింది. రైతులకు అదే పదివేలంటూ ఎంపీ అర్వింద్ సర్దుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. పైగా ఎక్స్టెన్షన్ ఆఫీసు.. పసుపు బోర్డు కన్నా మేలంటూ ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా మారింది.
రైతు పెన్నిధి టీఆర్ఎస్..
నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ భిన్న సారూప్యంతో కూడుకున్నది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక మంది రైతులే ఉన్నారు. ఎనిమిదేండ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక రైతు ప్రయోజన పథకాలను అమలు చేశారు. ఆర్మూర్ ప్రాంతంలో పెండింగ్లో ఉన్నటువంటి ఎర్రజొన్నల అంశాన్ని పరిష్కరించి రూ.కోట్ల మేర బకాయిలను చెల్లించారు. సాగునీటికి ఇక్కట్లు లేకుండా చేశారు. టీఆర్ఎస్ సర్కారుకు రైతుల మద్దతు రోజురోజుకూ పెరుగుతుండడంతో ఎన్నికలప్పుడు భారతీయ జనతా పార్టీ ఓ అబద్ధపు హామీతో రైతులను వంచించింది. అందుకు పసుపు బోర్డు, పసుపు పంటకు కనీస మద్దతు ధర వంటి హామీలే నిదర్శనం. 2014 నుంచి 2019 వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. కానీ పసుపు బోర్డును నరేంద్ర మోదీ సర్కారు మంజూరు చేయలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పసుపు బోర్డు అంశంపై బీజేపీ తప్పుడు ప్రకటనలతో రైతులను మోసం చేసింది. పసుపు బోర్డు తెస్తానంటూ బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలను మభ్యపెట్టిన అర్వింద్ గెలిచిన తర్వాత మచ్చుకు కూడా పసుపు బోర్డు ప్రస్తావనను ఏ వేదికపైనా లేవనెత్తడంలేదు. ఈ విషయంపై టీవీ చర్చలు, సోషల్ మీడియా, క్షేత్ర పర్యనటలో ఎవరైనా ప్రశ్నిస్తే అసహనానికి గురవుతున్నారు. ప్రశ్నించినవారిపై చిందులు తొక్కుతుండడం విడ్డూరంగా మారింది.
అర్వింద్ మాటలెవ్వరూ నమ్మరు
ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానని మమ్మల్ని మోసం చేసిన అర్వింద్ మాటలు ఇక ఎవరూ నమ్మరు. మాకోసం సీఎం కేసీఆర్ అందిస్తున్న పథకాలు చరిత్రలో నిలిచిపోతాయి. రైతుల కోసం పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ను ఇంగిత జ్ఞానం లేకుండా విమర్శించడం తగదు. ఇంకా రైతులను మోసం చేయాలని చూస్తే ఊరుకోబోం.
–బి.నరేందర్ యాదవ్ , రైతు, బట్టాపూర్, ఏర్గట్ల మండలం
అర్వింద్ మాటలే కోటలు.. పనులేమో సున్నా..
ఎంపీ అర్వింద్ మాటలే కోటలు దాటుతాయి. ప్రజలు, రైతుల కోసం ఆయన చేసిందేమీ లేదు. గెలిచి మూడేండ్లు గడిచినా ఒక్క అభివృద్ధి పని కూడా చేయించలేదు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మేలు, చేపట్టిన అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి. జిల్లా అభివృద్ధికి కేంద్రం నుంచి అర్వింద్ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. అలాంటిది సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపే అర్హత ఆయనకు లేదు. ఎన్నికలప్పుడు పసుపుబోర్డు తెస్తానని మోసం చేసిన విషయం మేం ఎప్పటికీ మర్చిపోము. ఇంకా మాయ మాటలతో మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు.
–మెహన్రెడ్డి, రైతు, మెండోరా