బిచ్కుంద, అక్టోబర్ 28 : రెండు పిచ్చికుక్కల దాడిలో 17 మంది గాయపడ్డ సంఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకున్నది. మండల కేంద్రంలోని పాతబస్టాండ్ ప్రాంతంలో పిచ్చి కుక్కలు తిరుగుతూ స్థానికులపై దాడికి పాల్పడ్డాయి. ఐదుగురు చిన్న పిల్లలు, 12 మంది పెద్దలు మొత్తం 17 మందిని కరిచాయి. బాధితులను స్థానికులు వెంటనే బిచ్కుంద ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో బాన్సువాడ ఏరియా దవాఖానకు రిఫర్ చేశారు. గ్రామ పెద్దలు రాజు, లక్ష్మణ్ తదితరులు అక్కడకు చేరుకుని అంబులెన్స్లో బాధితులను బాన్సువాడ దవాఖానకు తరలించారు.