మలిదశ తెలంగాణ ఉద్యమంలో మోతె గ్రామం దిక్సూచిలా నిలిచింది. కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో ఊరంతా ఆయన వెంటే నడిచింది. గ్రామస్తుల ఉద్యమ స్ఫూర్తిని చూసి కేసీఆర్ మోతె మట్టిని ముడుపు కట్టి చైతన్యాన్ని నింపారు. మోతె గొప్పతనాన్ని కేసీఆర్ తెలంగాణవ్యాప్తంగా చాటారు. నిజామాబాద్ జిల్లా మోతెతో ఉద్యమ నేత కేసీఆర్కు ప్రత్యేక అనుబంధం ఉంది. మలి దశ తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో పెనవేసుకున్న ఈ బంధం ఉద్యమ కాలమంతా..అటు తర్వాత స్వరాష్ట్రం సిద్ధించాక కేసీఆర్, టీఆర్ఎస్తో కొనసాగుతునే ఉంది. ఉద్యమం కోసం టీఆర్ఎస్తో మోతె కలిసి నడిస్తే ఈ గడ్డ మీద మట్టిని ముడుపు కట్టి తెలంగాణ ఉద్యమంలో చైతన్యాన్ని నింపారు కేసీఆర్. ఈ బంధం ఉద్యమానికి ఊతమివ్వడమే కాకుండా మోతె అభివృద్ధికి, సాగు,తాగునీటి సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదపడింది.
-కమ్మర్పల్లి, అక్టోబర్ 28
ఉద్యమ నేత మనసులో నిలిచిన మోతె
2001లో కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి పల్లెలు, పట్టణాలు కదం తొక్కాలని, ఏ ఊరికావూరే ఉద్యమ కేంద్రాలు కావాలని పిలుపునిచ్చారు.ఈ పిలుపును అందుకున్న మోతె గ్రామం ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ వెంట నడిచింది. అప్పట్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ వెంటే ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మోతె గ్రామస్తుల ఉద్యమ స్ఫూర్తిని కేసీఆర్ తెలంగాణ వ్యాప్తం చేశారు. ఈ గ్రామం తెలంగాణలోని వేలాది గ్రామాలకు ఉద్యమ దిక్సూచిగా నిలిచిందని.. మోతె బాటలో నడవాలని ఆనాడు పిలుపునిచ్చారు.మోతె ఉద్యమ స్పూర్తి కేసీఆర్కు సైతం వ్యక్తిగతంగా హృదయంలో నిలిచిపోయింది.
మోతె మట్టిని ముడుపు కట్టి
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఏకగ్రీవంగా అండగా నిలిచిన మోతెకు 2001 మే5 న వచ్చారు కేసీఆర్. గ్రామస్తులను అభినందించి ధన్యవాదాలు తెలిపి అదే రోజు మోతె మట్టిని ముడుపు కట్టి తన వెంట తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక తిరిగి మోతెకు వచ్చి ఇక్కడే ముడుపు విప్పుతానని ప్రకటించారు. ఇది తెలంగాణలో ఎన్నో గ్రామాల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. తెలంగాణం రాష్ట్రం సిద్ధించాక 2014 మార్చి 28న తనతో ఆది నుంచి ఉద్యమంలో పని చేసిన వేముల సురేందర్ రెడ్డి, ఆయన తనయుడు నేటి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి కేసీఆర్ మోతెకు వచ్చి ముడుపు విప్పారు.
అభివృద్ధి వెలుగులు
మోతెకు కోటి రూపాయల వ్యయంతో సౌకర్యవంతమైన గ్రామ పంచాయతీ భవనాన్ని అందించారు. గ్రామానికి రూ.1.30 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేశారు. దాని నిర్మాణం పూర్తి కావస్తున్నది. ఈ గ్రామం సాగు నీటికి అల్లాడుతుండేది. మోతె చెరువుకు నీరు అందే మార్గం లేక ఆయకట్టు పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉండేది. కేసీఆర్ సహకారంతో మూడు కిలో మీటర్ల దూరం నుంచి చెరువులోకి నీరు చేరేలా రూ.3 కోట్లతో మాటు కాలువను నిర్మించారు. దీంతో చెరువు రెండేండ్లుగా నిండు కుండలా ఉంటున్నది. మోతె అంచునే ఉన్న పెద్దవాగు పై రూ.5 కోట్లతో చెక్ డ్యాం కట్టించి వాగు వెంట భూముల్లో బోరు బావులకు శాశ్వత సాగు నీటి వనరును అందించారు.
పరస్పరం అండగా
మోతెకు కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..వారికి మోతె పరస్పర సహకారం కొనసాగుతూనే ఉన్నాయి. కేసీఆర్, ఉద్యమంతో అనుబంధం ఉన్న మోతె గ్రామం తెలంగాణ సాధనకు అవసరమైన ఎన్నికల్లోనే కాకుండా సాధించుకున్న తెలంగాణలో సైతం టీఆర్ఎస్కు అండగా నిలుస్తూ వచ్చింది. 2014లో, 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సైతం వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ముక్త కంఠంతో తీర్మానాలు చేసింది. కేసీఆర్ మోతెతో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ద్వారా మోతెకు అండగా నిలుస్తూ వస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మోతెకు వచ్చారు. మోతెను అభివృద్ధిని పథంలో నడిపించారు. మోతెపై మంత్రి సైతం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వస్తున్నారు.