బీర్కూర్, అక్టోబర్ 26 : పలు ప్రాంతాల్లో రోడ్లపై ప్రయాణించాలంటేనే వణుకు పుడుతున్నది. కారణం రోడ్లపై విచ్చలవిడిగా ధాన్యం ఆరబోయడమే.. వర్షాకాలం పంటలు చేతికి రావడంతో బీర్కూర్, బాన్సువాడ, నస్రుల్లాబాద్, కోటగిరి మండలాల్లోని రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోస్తున్నారు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి.
ప్రభుత్వం కల్లాలు మంజూరు చేసినా
ప్రమాదాల నివారణకు గాను ప్రభుత్వం రైతులకు కల్లాల ఏర్పాటు చేసుకునేందుకు నిధులు మంజూరు చేస్తున్నది. కొంత మంది కల్లాలు ఏర్పాటు చేసుకోగా మరికొంత మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టిన పక్షంలో ఒకవైపున మాత్రమే ఆరబెట్టుకోవాలని, కుప్పలపై తెలుపు రంగు పట్టాలను కప్పుకోవాలని రైతులకు రెవెన్యూ, పోలీసు అధికారులు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయినా కొంతమంది రైతుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
రెండేండ్లలో 20కి పైగాప్రమాదాలు
రెండేండ్లలో బీర్కూర్ మండలంలో 20 వరకు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన ఇరాస్ రాములు 2019లో బీర్కూర్-పొతంగల్ ప్రధాన రహదారిపై ధాన్యం కుప్పను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. గతేడాది బీర్కూర్-నస్రుల్లాబాద్ ప్రధాన రహదారిపై బీర్కూర్లో పంచాయతీ కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి మరణించగా, అదేవిధంగా చించోలి గ్రామం వద్ద గుంటూరు చెందిన ఒక తాపీ మేస్త్రీ సైతం మరణించాడు. వరి కోతలు ప్రారంభమైనందున రెవెన్యూ, పోలీసు శాఖలు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.
వీఆర్ఏలను అప్రమత్తం చేస్తాం
మండలంలోని ప్రధాన రహదారులపై సాధ్యమైనంతమేర రైతులు ధాన్యం ఆరబెట్టకుండా వీఆర్ఏలను అప్రమత్తం చేస్తాం. రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. రోడ్లపై ధాన్యం కేవలం కాంటాలు ప్రారంభమయ్యే వరకే ఉంటాయి. రైతులకు ధాన్యం ఆరబెట్టే విషయమై అవగాహన కల్పిస్తున్నాం.
-ఎం. రాజు, తహసీల్దార్, బీర్కూర్