టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ వేదికగా నేడు పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నది. కరోనా కారణంగా గత ఏడాది ప్లీనరీ నిర్వహించలేకపోయింది. కమిటీల నియామకాలు సైతం వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సంస్థాగత నిర్మాణం పూర్తయ్యింది. ప్లీనరీ, విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సన్నాహక సమావేశాలను నిర్వహించారు. ప్లీనరీకి పరిమిత సంఖ్యలోనే ముఖ్యులనే ఆహ్వానిస్తున్నారు. నూతనంగా ఎన్నికైన పార్టీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీపీలు, నియోజవర్గంలో కీలక నేతలకు ఆహ్వానాలు అందాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 40 మంది వరకు ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలున్నాయి. డీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్లు సైతం హాజరుకానున్నారు. ఏడేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్లీనరీలో చర్చ జరుగనున్నది. ప్లీనరీ పూర్తయిన తర్వాత విజయగర్జన సభ సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ నిర్వహించిన సభలకు దీటుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు.
నిజామాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి దిగ్విజయంగా ఇరవై ఏండ్లు పూర్తి చేసుకున్నది. రెండు దశాబ్దాల కాలంలో అనేక అద్భుత ఘట్టాలకు సాక్షాత్కారమైన టీఆర్ఎస్ పార్టీ గతేడాది ప్లీనరీ నిర్వహించలేక పోయింది. కరోనా మహమ్మారి విజృంభణ మూలంగా పార్టీ కార్యక్రమాలను అట్టహాసంగా చేపట్టలేదు. కమిటీల కూర్పు సైతం వాయిదా పడగా తాజాగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సంస్థాగత నిర్మాణం పూర్తయ్యింది. ప్రతి ఊరు, వాడల్లో తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎగురవేసే విధంగా పటిష్టవంతమైన కార్యాచరణతో గులాబీ దళపతి కార్యవర్గాలను కూర్పు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీల ఏర్పాటుతో పాటు అనుబంధ సంఘాలను నియమించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో పదవులు దక్కించుకున్న వారంతా కొంగొత్త హుషారుతో ఉన్నారు. నూతనంగా పదవులు చేపట్టిన కీలకమైన నాయకులతో ద్విదశాబ్ది వేళ టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహిస్తోంది. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ప్రజా ప్రతినిధులతో పాటు ముఖ్యమైన నాయకులంతా తరలి వెళ్లనున్నారు.
పరిమితంగానే ఆహ్వానితులు..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరిగే ప్లీనరీకి పరిమిత సంఖ్యలో ఆహ్వానించారు. నూతనంగా ఎన్నికైన పార్టీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీపీలను ప్లీనరికి పిలిచారు. నియోజకవర్గంలో కీలకమైన నేతలుంటే వారిని కూడా ప్లీనరీకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే నేతృత్వంలోనే వీరందరికీ ఆహ్వానాలు అందాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 40 మంది వరకు ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి 40 నుంచి 50 మంది వరకు హాజరవుతారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు 400 మంది ప్రతినిధులు సోమవారం జరిగే ప్లీనరీలో పాల్గొనబోతున్నారు. 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమన్వయం చేస్తున్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్లు సైతం హాజరు కానున్నారు. ప్లీనరీలో ఏడేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చ జరుగనున్నది.
గర్జనకు సమాయత్తం…
తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చే నెల 15న చారిత్రక వరంగల్లో భారీ బహిరంగ సభను తలపెట్టింది. తెలంగాణ విజయగర్జన పేరుతో నిర్వహించే ప్రతిష్టాత్మక సభను చరిత్రలో నిలిచి పోయే విధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇరవై ఏండ్ల కాలంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభలకు దీటుగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఉద్యమంలో, బంగారు తెలంగాణ సాధనలో కేసీఆర్ అంకుఠిత దీక్షకు కృతజ్ఞతగా ఆయనపై అభిమానాన్ని చాటే విధంగా బ్రహ్మాండంగా సభ జరగాలని గులాబీ శ్రేణులను పార్టీ ఆదేశించింది. ప్రతి పల్లె, పట్టణం, నగరాలు సభ వైపు కదలేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేలా సమన్వయం చేసుకునేలా యాక్షన్ ప్లాన్ను ఆయా జిల్లాల బాధ్యులకు స్వయంగా కేటీఆర్ వివరిస్తున్నారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కల సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అద్భుత పాలనతో ప్రతి కుటుం బం సుఖశాంతులు, చిరునవ్వులతో జీవించేలా చేస్తూ, వారి గుండెల్లో నిలుస్తున్నారు. తెలంగాణ విజయ గర్జన సభను జయప్రదం చేసేందుకు రోజుకు 20 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ వరుసగా సమీక్షలు నిర్వహించి నేతలను సంసిద్ధం చేశారు. ప్రతి గ్రామం నుంచి భారీ సభకు ప్రజలు తరలి వెళ్లే విధంగా ఘనంగా ఏర్పాట్లు చేయబోతున్నారు.
27న సన్నాహక సభలు..
నేడు ప్లీనరీ పూర్తయిన తర్వాత నేతలంతా ఈ నెల 27న అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరంగల్ సభకు సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడిన షెడ్యూల్ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇందులో కొత్తగా నియామకమైన గ్రామ, మండల, నియోజకవర్గస్థాయి కమిటీ బాధ్యులతో పాటు అనుబంధ సంఘాలకు సంబంధించిన కార్యవర్గాలు పాల్గొంటాయి. ప్రతిపక్ష పార్టీల దిమ్మతిరిగే విధంగా వరంగల్లో నిర్వహిస్తోన్న భారీ సభను జయప్రదం చేసేందుకు శ్రేణులను సమాయత్తం చేయబోతున్నారు. ఎమ్మెల్యేలు కీలక ఉపన్యాసం ద్వారా భారీ సభ ఉద్దేశాలను పార్టీ కార్యకర్తలకు వివరించబోతున్నారు. గ్రామాల వారీగా జన సమీకరణతోపాటు వరంగల్కు రాకపోకలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలువురు నాయకులకు బాధ్యతలు అప్పగించబోతున్నారు. విజయ గర్జన సభకు తరలి వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ గర్జన సభకు ఇంకా 20 రోజులు సమయం ఉన్నప్పటికీ నేటి నుంచే సంసిద్ధులై ఉండేలా శ్రేణులను సిద్ధం చేయబోతున్నారు.