కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనుండగా.. అరగంట ముందే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు ప్రయోగాత్మకంగా మొబైల్ యాప్ను వినియోగించనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 113 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 27,588 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
నిజామాబాద్ సిటీ/విద్యానగర్/ఆర్మూర్, అక్టోబర్ 24: కరోనా నేపథ్యంలో వాయిదాపడిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నేటి నుంచి (సోమవారం) ప్రారంభం కానున్నాయి. కొవిడ్ నిబంధనలతో పరీక్షలను నిర్వహించనుండగా, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. విద్యార్థులు పరీక్షా సమయానికి అరగంట ముందే సెంటర్కు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో కొత్తగా మొబైల్ యాప్ సేవలను వినియోగించనున్నారు. మాల్ప్రాక్టీస్, బ్లాంక్ బార్కోడ్, ఆబ్జెక్ట్, డ్యామేజ్డ్, ఎయిడెడ్ క్యాండేట్స్ వంటివాటికోసం ఈ యాప్ను విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది.
ఉమ్మడి జిల్లాలో హాజరుకానున్న 27,588మంది విద్యార్థులు..
నిజామాబాద్ జిల్లాలో 18697 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందులో 16480 మంది జనరల్, 2217 మంది వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 71 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 16 ప్రభుత్వ కళాశాలలు, 2 ఎయిడెడ్, 3 సోషల్ వెల్ఫేర్స్, 8 టీఎస్ మోడల్ స్కూళ్లు, 27 ప్రైవేట్ కాలేజీలు, 4 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 8891 మంది జనరల్, 1141 మంది వొకేషన్ కలిపి మొత్తం 10,032 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా మొత్తం 42 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 27 ప్రభుత్వ, 15 ప్రైవేట్ కళాశాల సెంటర్లు ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని జీవీఎస్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని పాత కలెక్టరేట్లోని మైనారిటీ మహిళా జూనియర్ కళాశాలకు మార్చారు. కామారెడ్డి జిల్లాలో పరీక్షలను పర్యవేక్షించేందుకు 42 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 42 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, ముగ్గురు సిట్టింగ్ స్కాడ్లు, ఇద్దరు ఫ్లయింగ్ స్కాడ్లు, 15 మంది అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, మూడు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. వీరితోపాటు రెండు హైపర్ కమిటీలను ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తారు. ఇందుల్లో చైర్మన్గా కలెక్టర్, సభ్యులుగా ఎస్పీ, ఇంటర్ నోడల్ అధికారి, సీనియర్ ప్రిన్సిపాళ్లు ఉన్నారు. సుమారు 510 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు.
ప్రిన్సిపాల్ సంతకం అవసరంలేదు..
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. సెంటర్ల వద్ద ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నాం. కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి హాల్టికెట్లను నేరుగా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. హాల్టికెట్లపై ప్రిన్సిపాళ్ల సంతకం, కళాశాల స్టాంపులు అవసరం లేదు. విద్యార్థి ఫొటో, వివరాలను పరిశీలించి పరీక్ష రాసేందుకు అనుమతిస్తాం.
-రఘురాజ్, డీఐఈవో, నిజామాబాద్
అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం..
ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలను కొవిడ్ నిబంధనల మేరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. నిమిషం ఆలస్యంగా వచ్చినా కేంద్రంలోనికి అనుమతించం. విద్యార్ధులు పరీక్షా సమయానికి అరగంట ముందే చేరుకోవాలి.
-షేక్ సలాం, నోడల్ అధికారి, కామారెడ్డి
సెంటర్ల వద్ద 144 సెక్షన్
ఇంటర్మీడియెట్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు నిజామాబాద్ సీపీ కార్తికేయ, కామారెడ్డి ఎస్పీ శ్వేత తెలిపారు. పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సెంటర్లకు చుట్టుపక్కల ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. పరీక్షలను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.