ఖలీల్వాడి, అక్టోబర్ 23: సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇవ్వనున్నట్లు నిజామాబాద్ ఆర్ఎం సుధాపరిమళ తెలిపారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే వివాహాలు, వేడుకలు, దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగా బస్సులను బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు 200 కి.మీ వరకు పికప్, డ్రాప్ పద్ధతిలో అడ్వాన్స్ లేకుండా సాధారణ చార్జి వసూలు చేయనున్నట్లు తెలిపారు. 200 కిలో మీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్లే వారు పల్లె వెలుగు బస్సుకు 1.1 చార్జీతో, ఎక్స్ప్రెస్ బస్సుకు మామూలు చార్జీతో ఎటువంటి అడ్వాన్స్ లేకుండానే బస్సులు ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు. సూపర్ లగ్జరీ బస్సులను కనీసం 300 కి.మీ, రాజధాని ఏసీ బస్సులను కనీసం 400 కి.మీ ఉంటే అడ్వాన్స్ లేకుండానే బస్సులు ఇస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని నిజామాబాద్, కామారెడ్డి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బస్సులను బుక్ చేసుకోవడానికి ఆర్మూర్ డిపో మేనేజర్ 9959226019, బోధన్ డిపో మేనేజర్ 9959226001, నిజామాబాద్ డిపో -1 మేనేజర్ 9959226016, నిజామాబాద్ డిపో -2 మేనేజర్ 99592 26017, కామారెడ్డి డిపో మేనేజర్ 99592 26018, బాన్సువాడ డిపో మేనేజర్ 99592 26020 నంబర్లను సంప్రదించాలని ఆమె కోరారు.