నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 20: నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ తండా శివారులో ఉన్న మల్లారం గండిలో బుధవారం సాయంత్రం ప్యాసింజర్ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికకక్కడే దుర్మరణం చెందగా, తీవ్ర గాయాలైన మరో ముగ్గురిని జిల్లా ప్రభుత్వ దవాఖానకు అంబులెన్స్లో తరలించారు. ఘటనకు సంబంధించి ఎస్హెచ్వో లింబాద్రి, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జక్రాన్పల్లి మండలంలోని పడకల్ తండాకు చెందిన బానోత్ సువర్ణ (30), నిజామాబాద్ నగరంలోని సంతోష్నగర్ నివాసి పవర్ ఉషా (48) ఇద్దరు మల్కాపూర్ తండాలో తమ బంధువుల ఇంటికి వచ్చి దసరా పండుగ జరుపుకొన్నారు. బుధవారం సాయం త్రం వారు తిరుగు ప్రయాణం కోసం మల్కాపూర్ తండా వద్ద ప్యాసింజర్ ఆటోఎక్కారు. ఎక్కిన పది నిమిషాల్లోనే మార్గమధ్యంలో మల్లారం గండిలో ఓ మూలమలుపు వద్ద ఎదురుగా లారీ రావడంతో డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో సువర్ణ, ఉష మెదడులు చితికి అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించారు. డ్రైవర్ ఆటోను అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఎస్హెచ్వో తెలిపారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఎస్హెచ్ వో పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలాన్ని సం దర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం జిల్లా ప్రభుత్వ దవాఖానలోని మార్చురీ గదికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు జరుపుతున్నామని ఆయన తెలిపారు.
బ్రేక్ ఫెయిల్తో వాహనాలను ఢీకొన్న లారీ
ఆటో బోల్తా పడిన సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎస్హెచ్వో సంఘటనా వివరాలను సేకరిస్తున్న క్రమంలో వర్ని వైపు నుంచి ఇసుక లారీ నిజామాబాద్ వెళ్తున్నది. ఆటో బోల్తా పడిన సంఘటనా స్థలం వద్దనే బ్రేక్ ఫెయిల్ కావడంతో నిలిపి ఉంచిన నాలుగు బైక్లతోపాటు కారును ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇసుక లారీని 5వ టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు.