న్యూఢిల్లీ: రాజ్యసభలో బొటాబొటీ మెజార్టీతో నెట్టుకొట్టుకొస్తున్న అధికార బీజేపీకి బీహార్ సీఎం నితీష్ కుమార్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. నితీష్ నేతృత్వంలోని జేడీయూ.. ఎన్డీఏ (NDA) నుంచి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో పెద్దల సభలో ఎన్డీయే బలం మరింత పడిపోయింది. రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ హరివంశ్ సహా జేడీయూకి ఐదుగురు సభ్యులు ఉన్నారు.
సభలో ప్రస్తుతం 237 మంది సభ్యులు ఉన్నారు. దీంతో మెజార్టీ సభ్యుల సంఖ్య 119. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి 115 మంది సభ్యులు ఉన్నారు. అయితే తాజాగా అధికార కూటమికి నితీష్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఎన్డీయే బలం 110కి పడిపోయింది. అంటే మెజార్టీకి మరో తొమ్మిది మంది సభ్యులు అవసరం.
కాగా, ప్రస్తుతం రాజ్యసభలో ఎనిమిది ఖాళీలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం ముగ్గురిని నియమించుకోవచ్చు. అదేవిధంగా త్రిపుర స్థానాన్ని బీజేపీ గెలుచుకునే అవకాశం ఉన్నది. దీంతో ఎన్డీయే కూటమి సభ్యుల సంఖ్య 114కు చేరింది. అయితే వారందరి నియామకాలతో సభలో మెజారిటీ సంఖ్య 121కి చేరుతుంది. ఈ లెక్కన ఎన్డీయేకి మరో ఏడుగురు సభ్యులు అవసరమవుతారు.
కాగా, ప్రధానమైన బిల్లులు సభలో ప్రవేశపెట్టినప్పుడు అధికారపార్టీ ఏపీకి చెందిన వైసీపీ, ఒడిశాకు చెందిన బీజేడీ మద్దతు తీసుకుంటున్నది. ఇదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గట్టెక్కారు.