బీహార్లో మంగళవారం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. కూటముల సమీకరణాలూ మారిపోయాయి. ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేశారు. ఆ వెంటనే గవర్నర్ను కలిసి తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్కడినుంచి నేరుగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు.
తమకు మద్దతిస్తున్న ఏడు పార్టీల నేతలతో మరోసారి గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. బుధవారం మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసుకొన్నారు. నితీశ్ చర్యతో బీజేపీ అధిష్ఠానం షాక్కు గురైంది. జేడీయూ నుంచి బయటకు వచ్చిన నేత ఆర్సీపీ సింగ్ను అడ్డుపెట్టుకొని జేడీయూలో సంక్షోభం సృష్టించాలనుకొన్న బీజేపీ ఆశలు గల్లంతయ్యాయి. నితీశ్ వేగంగా మేలుకొని వ్యూహాత్మకంగా కదిలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగారు. నితీశ్ చర్యలను విపక్షపార్టీలు ముక్తకంఠంతో శ్లాఘించాయి. దేశ రాజకీయాల్లో మార్పునకు ఇది సంకేతమని కొనియాడాయి.
పాట్నా, ఆగస్టు 9: దేశవ్యాప్తంగా ఎన్నికల రాజకీయాలు ఊపందుకొన్న వేళ బీజేపీకి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. బీజేపీ, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దుచేసి కాషాయ పార్టీని అధికారానికి దూరం చేశారు. మిత్రపక్షాలను కూడా వంచిస్తూ తాను బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీతో తెగదెంపులు చేసుకొని.. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో చేరిపోయారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ధ్వంసం చేసి ఏకపార్టీ వ్యవస్థను సృష్టించాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది. మంగళవారం సీఎంగా రాజీనామా చేసిన ఆయన, బుధవారం మహా ఘట్బంధన్ అభ్యర్థిగా బీహార్ సీఎంగా ఎనిమిదోసారి ప్రమాణం చేయనున్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రి కానున్నారు.
రోజంతా నాటకీయ పరిణామాలు
కొద్ది రోజులుగా హీటెక్కిన బీహార్ రాజకీయాల్లో మంగళవారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జేడీయూ అధినేత నితీశ్ ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమై ఎన్డీయే నుంచి బయటకు రావాలని నిర్ణయించారు. వెంటనే రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ ఫగూ చౌహాన్ను కలిసి రాజీనామా లేఖ అందించారు. అటునుంచి ఆర్జేడీ నేత, మాజీ సీఎం రబ్రీదేవి నివాసానికి చేరుకొని మహా ఘట్బంధన్ భాగస్వామ్య పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల నేతలతో సమావేశమయ్యారు. భేటీలో మహా ఘట్బంధన్ సీఎం అభ్యర్థిగా నితీశ్ను కూటమి పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఎంపిక చేశాయి. ఆ వెంటనే ఆర్జేడీ యువనేత తేజస్వీతో కలిసి మళ్లీ రాజ్భవన్ వెళ్లిన ఆయన, తనకు మద్దతిస్తున్న 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు అందించారు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు నితీశ్కుమార్కు గవర్నర్ అవకాశం ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నితీశ్కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు.
ముందుగానే మేల్కొన్న నితీశ్
బీహార్ అసెంబ్లీకి 2020లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 245 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో రెండు స్థానాలు నామినేటెడ్ కాగా, 243 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో మహా ఘట్బంధన్ కూటమిలోని ఆర్జేడీ 75 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74, జేడీయూ 43, కాంగ్రెస్ 19 సీట్లు గెలిచాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటానికి 122 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, బీజేపీ, జేడీయూ, వీఐపీ, హెచ్ఏఎల్తో కలిసి నితీశ్ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమిలో ఈ ఏడాది ప్రారంభంలో చీలికలు ప్రారంభమయ్యాయి.
ముఖ్యంగా మహారాష్ట్రలో శివసేనను నిలువునా చీల్చి రెబల్ వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటంతో నితీశ్కుమార్లో భయం మొదలైంది. అందుకు ఆర్సీపీ సింగ్ వ్యవహారం కూడా తోడుకావటంతో జేడీయూలో చీలిక తప్పదేమోనన్న భయం మరింత ఎక్కువైంది. ఒకప్పుడు నితీశ్కు నమ్మిన బంటుగా ఉన్న ఆర్సీపీ సింగ్కు మోదీ సర్కారులో బీజేపీ మంత్రి పదవి ఇచ్చింది. ఆయనకు పదవి ఇస్తారన్న విషయం చివరివరకు నితీశ్కు తెలియదని అప్పట్లో జేడీయూ వర్గాలు మండిపడ్డాయి. రాజ్యసభ సభ్యుడిగా ఇటీవల ఆర్సీపీ సింగ్ పదవీకాలం ముగియటంతో తెలివిగా ఆలోచించిన నితీశ్, ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ఈ పరిణామాల మధ్యనే ఇటీవలికాలంలో సీఎంపై బీజేపీ నేతల విమర్శల పరంపర పెరుగుతూ వచ్చింది.
ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి అయినప్పటికీ, ప్రభుత్వ తప్పులన్నింటికీ ముఖ్యమంత్రే కారణమనేలా ఆ పార్టీ విమర్శలు గుప్పించటం నితీశ్కుమార్లో మరింత అభద్రతాభావాన్ని పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు కూడా వెన్నుపోటు తప్పదని ఊహించిన ఆయన, ఎన్డీయే నుంచి దూరం జరుగుతూ వచ్చారు. బీజేపీ వ్యతిరేకిస్తున్నప్పటికీ దేశంలో ఓబీసీ కుల గణన చేపట్టాలని తీర్మానం చేశారు. జేడీయూను బలహీనపరుస్తూ బీహార్లో బీజేపీ బలపడుతున్నదని బహిరంగంగానే ఆరోపించారు.
దేశంలో ప్రాంతీయ పార్టీలు త్వరలోనే ధ్వంసమైపోతాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా బీహార్కే వెళ్లి ప్రకటించటంతో పరిస్థితులు మరింత క్షీణించాయి. బీజేపీతో తనకు ఎప్పటికైనా ప్రమాదమేనని భావించిన ఆయన, మంగళవారం తన పార్టీ నేతలందరితో సమావేశమై ఎన్డీయే నుంచి బయటకు రావాలని నిర్ణయించారు. జేడీయూతోపాటు హెచ్ఏఎల్ కూడా బీజేపీని వీడి మహా ఘట్బంధన్లో చేరిపోయింది. బుధవారం కొలువుదీరే మహా ఘట్బంధన్ ప్రభుత్వంలో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ భాగస్వాములు కానుండగా, వామపక్షాలు బయటనుంచి మద్దతు ఇవ్వనున్నాయి.
గవర్నర్కు రాజీనామా సమర్పించిన అనంతరం ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ను కలుసుకున్న నితీశ్కుమార్
2014 తర్వాత బీజేపీకి గుడ్బై చెప్పిన మిత్రపక్షాలు
శివసేన, శిరోమణి అకాలీదళ్, జేడీయూ, పీడీపీ, టీడీపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ, బోడో పీపుల్స్ ఫ్రంట్, గూర్ఖా జన్ముక్తి మోర్చా, గోవా ఫార్వార్డ్ పార్టీ, ఎండీఎంకే, డీఎండీకే, హర్యానా జనహిత్ కాంగ్రెస్, హిందుస్థాన్ ఆవామ్ మోర్చా