పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీతో టచ్లో ఉన్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. పరిస్థితులు ప్రతికూలంగా మారితే ఆయన ఆ పార్టీతో తిరిగి చేతులు కలపవచ్చని అన్నారు. జేడీ(యూ) మాజీ నేత అయిన ప్రశాంత్ కిషోర్ ‘వ్యవస్థలో మార్పు కోసం ప్రజల మద్దతు’ పేరుతో గాంధీ జయంతి అయిన ఈ నెల 2 నుంచి బీహార్లో పాదయాత్ర చేపట్టారు. 3,500 కిలోమీటర్ల పాదయాత్రను ఏడాదిన్నరలో పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు.
కాగా, ఈ పాదయాత్రలో భాగంగా పీటీఐ వార్తా సంస్థతో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ కూటమిని చురుగ్గా నిర్మిస్తున్నారని ప్రజలు భావిస్తున్న నితీశ్ కుమార్, బీజేపీతో లైన్ తెరిచే ఉంచారని ఆరోపించారు. పార్టీ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ద్వారా బీజేపీతో జేడీ(యూ)కి గట్టి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ కారణంగానే రాజ్యసభ పదవికి రాజీనామా చేయమని హరివంశ్ను ఆయన కోరలేదని అన్నారు. ‘ఈ విషయం తెలిస్తే ప్రజలు ఆశ్చర్యపోతారు. ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పుడల్లా నితీశ్ మళ్లీ బీజేపీతో కలిసి పనిచేస్తారన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి’ అని అన్నారు.
మరోవైపు ప్రశాంత్ కిషోర్ ఆరోపణలను జేడీ(యూ) ఖండించింది. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఆయన అలాంటి తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ నేత త్యాగి విమర్శించారు. నీతిశ్ కుమార్ 50 ఏళ్లగాపైగా రాజకీయాల్లో ఉండగా, ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లోకి వచ్చి ఆరు నెలలే అయ్యిందన్నారు.