పాట్నా, ఆగస్టు 9: 1942, ఆగస్టు 9.. బ్రిటిష్కు వ్యతిరేకంగా దేశమంతటా భారత్ ఛోడో అందోళన మిన్నంటిన రోజు! 2022, ఆగస్టు 9.. బీహార్లో బీజేపీ భాగో అన్న నినాదాలు రేగిన రోజు!! 2014 నుంచి తాను చెప్పిందే వేదం.. చేసింది శాసనమన్నట్టుగా నియంతృత్వ ధోరణితో బీజేపీ సాగించిన రాజకీయానికి బీహార్ గట్టి ఝలక్ ఇచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన 8 ప్రభుత్వాలను నిరంకుశంగా కూలుస్తూ వచ్చిన బీజేపీకి బీహార్లో నితీశ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. దేశంలో ఏక పార్టీ వ్యవస్థను స్థాపించి ప్రాంతీయ పార్టీలను సమూలంగా నిర్మూలించాలన్న కమలనాథులకు ఊహించని రీతిలో శృంగభంగమైంది. మహారాష్ట్రలో మాదిరిగా ఆర్సీపీ సింగ్ రూపంలో మరో ఏక్నాథ్ను తయారు చేద్దామనుకొన్న బీజేపీ పాచికలు పారలేదు.
బీహార్ సీఎం నితీశ్ ముందుగా అప్రమత్తమవడంతో మరో ప్రభుత్వానికి గండం తప్పింది. బీజేపీ ఎత్తుకు పైఎత్తు వేసి ప్రభుత్వాన్ని కాపాడుకొన్నారు. అప్రతిహతంగా ప్రభుత్వాల ధ్వంస రచన చేస్తూ పోతున్న బీజేపీకి ఇది ఎదురుదెబ్బ కాగా.. దేశంలోని ప్రాంతీయ పార్టీల పోరాటానికి కొత్త బలాన్ని ఇచ్చినట్టయింది. బీహార్లో రాజకీయ సమీకరణాల కారణంగానే పార్లమెంట్ సమావేశాలను 4 రోజుల ముందుగానే కేంద్రం వాయిదా వేసిందన్న విపక్షాల ఆరోపణలు నిజమేనని మంగళవారం నితీశ్ రాజీనామా తేల్చిచెప్పింది.
తొలిరోజు నుంచే సమస్యలు..
2015లో అవార్డు వాపసీ నినాదంతో బీజేపీని కాలదన్ని అధికారంలోకి వచ్చిన నితీశ్కుమార్.. రెండేండ్ల తరువాత మిత్రపక్షం ఆర్జేడీని వదులుకొని మళ్లీ బీజేపీ పంచన చేరడం పొరపాటని 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విస్పష్టంగానే చెప్పాయి. 43 సీట్లతో మూడో స్థానానికి పడిపోయిన నితీశ్ పార్టీ జేడీయూ.. తప్పనిసరిగా బీజేపీ వెంట నడవాల్సి వచ్చింది. తక్కువ సీట్లు వచ్చిన జేడీయూకు అధికారం అప్పగించినప్పుడే.. నితీశ్ పరిస్థితి.. కర్ణాటకలో కుమారస్వామి మాదిరి తయారైంది. నితీశ్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి.. రాష్ట్రంలో తాను బలపడాలని బీజేపీ ఎత్తుగడ. రెండేండ్లుగా బీహార్లో సాగుతున్న రాజకీయం అదే. అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే విజయ్కుమార్ను నియమించారు. ఆయన నితీశ్ సర్కారుపై పదేపదే విమర్శలు చేస్తున్నా.. తొలగించలేని నిస్సహాయ స్థితిలో నితీశ్ ఉండిపోయారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో చేరబోమని నితీశ్ కుండబద్దలు కొట్టినప్పటికీ.. 2021లో ఆయన అభీష్టానికి భిన్నంగా జేడీయూ రాజ్యసభ ఎంపీ ఆర్సీపీ సింగ్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. ఆర్సీపీ సింగ్ జేడీయూలో ఉంటూనే.. బీజేపీకి విధేయుడిగా మారిపోయారు. కొంతకాలంగా ఆర్సీపీ సింగ్ నితీశ్కుమార్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. నితీశ్కుమార్కు అసూయ ఉండటం మంచిది కాదనీ.. ఏడు జన్మలెత్తినా ప్రధాని కాలేరని ఎద్దేవా చేశారు కూడా. ఈ క్రమంలోనే ఆర్సీపీ సింగ్ను మరో ఏక్నాథ్ షిండేగా మార్చి.. జేడీయూలో చీలిక తెచ్చే ఆటలో పావుగా వాడుకోవాలని బీజేపీ నాయకత్వం తలపోసిందని నితీశ్ భావించారు. జేడీయూ ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టించి.. తనను ఒంటరిచేసి గద్దె దింపాలని ఎత్తులు వేసిందని అనుమానించారు.
పరిణామాలను గ్రహించిన నితీశ్ వ్యూహాత్మకంగా కదిలారు. ఇటీవల ఆర్సీపీ సింగ్ పదవీకాలం ముగిసిన వెంటనే మరోసారి ఆయన్ను పెద్దల సభకు పంపించడానికి నితీశ్ నిరాకరించారు. దీంతో ఆయన కేంద్ర మంత్రి పదవిపోయింది. ఆయన అవినీతిపరుడని జేడీయూ ఆరోపించడంతో పార్టీ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్డీయేతో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 7న ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ సమావేశానికి నితీశ్ హాజరుకాలేదు. అంతకుముందు రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికీ నితీశ్ వెళ్లలేదు. అంతకుముందు కొవిడ్ నియంత్రణ చర్యలపై ప్రధాని నిర్వహించిన సీఎంల సమావేశానికీ నితీశ్ హాజరుకాలేదు. మంగళవారం బీహార్ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి.
నితీశ్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. గవర్నర్ దగ్గరకు వెళ్లారు.. రాజీనామా చేశారు. వెంటనే రబ్రీదేవి ఇంటికి వెళ్లారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ను వెంటపెట్టుకొని మళ్లీ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. బుధవారం తిరిగి ప్రమాణం చేయడానికి ముహూర్తాన్నీ ఫిక్స్ చేసుకొన్నారు. ఈ పరిణామాలన్నింటినీ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన బీజేపీ.. మంగళవారం రాత్రికి నోరు విప్పింది. నితీశ్ ద్రోహం చేశారంటూ మొసలి కన్నీరు కార్చడం మొదలుపెట్టింది.