Nitish Kumar | జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మంగళవారం గవర్నర్ ఫాగు చౌహాన్తో భేటీ అయ్యారు. తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నితీశ్ కుమార్ చెప్పారు. గవర్నర్తో భేటీ తర్వాత తేజస్వి యాదవ్తో కలిసి నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఏడు రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఉందని వెల్లడించారు.
గవర్నర్ నిర్ణయం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని నితీశ్కుమార్ తెలిపారు. బీజేపీ వ్యవహార శైలి సరిగ్గా లేదని అన్నారు. 2017లో తప్పు చేశానని అంగీకరించారు. మళ్లీ ఆ తప్పు చేయబోనని చెప్పారు. గవర్నర్కు సమర్పించిన మద్దతు లేఖపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సంతకాలు చేశారన్నారు.
హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బీజేపీకి చోటు లేదని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే బీహార్లో జేడీయూను చీల్చి బీజేపీ సొంతంగా పాలన సాగించాలనుకుంటున్నదని అన్నారు. నితీశ్ కుమార్ తొందరగా మేల్కుకుని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారన్నారు. మహారాష్ట్రలో ఏం జరిగిందో అందరికీ తెలుసునన్నారు.
ప్రజాస్వామ్య విచ్ఛిన్నానికి బీజేపీ కుట్ర చేస్తున్నదని తేజస్వి యాదవ్ ఆరోపించారు. బీహార్ ప్రజలు బీజేపీకి వ్యతిరేకం అని అన్నారు. భాగస్వామ్య పార్టీలను చీల్చి పాలన సాగించాలని బీజేపీ భావిస్తున్నదని అన్నారు. పొత్తు పెట్టుకున్న పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మహాఘట్బంధన్ పని చేస్తుందని స్పష్టం చేశారు.