ఇస్రో-నాసా సంయుక్త ప్రాజెక్టు ‘నిసార్’
విపత్తులను ముందే పసిగట్టి హెచ్చరికలు
సెంటీమీటర్ స్థాయిలో జరిగే మార్పులనూ గుర్తించే టెక్నాలజీ
మరో ఏడాదిలో ప్రయోగం.. మూడేండ్ల పాటు సేవలు
బెంగళూరు: ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి.. అధికారులను అప్రమత్తం చేస్తూ.. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే ఉద్దేశంతో ప్రారంభమైన ‘నాసా-ఇస్రో సార్’ (నిసార్) సంయుక్త ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అగ్రశ్రేణి రోదసి సంస్థలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. దీంట్లోభాగంగా అత్యంత స్పష్టమైన చిత్రాలను తీసే ఎస్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీకి చెందిన సింథటిక్ అపార్చర్ రాడార్ (సార్) పేలోడ్ను తాజాగా ఇస్రో అభివృద్ధి చేసింది. దీన్ని ఇటీవలే నాసాకు తరలించారు. ఈ ‘ఎస్-బ్యాండ్ సార్ పేలోడ్’ను నాసా అభివృద్ధి చేయనున్న ‘ఎల్-బ్యాండ్ సార్ పేలోడ్’కు అనుసంధానించనున్నారు.
ఏమిటీ ప్రయోగం?
భూ ఉపరితల పరిశీలన కోసం ‘నిసార్’ మిషన్ను చేపట్టారు. రెండు ఫ్రీక్వెన్సీలతో రాడార్లను ఉపయోగిస్తూ ప్రయోగిస్తున్న తొలి మిషన్ ఇదే. ఇందులో ఎస్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీ రాడార్ను ఇస్రో అభివృద్ధి చేయగా, ఎల్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీ రాడార్ను నాసా అభివృద్ధి చేయబోతుంది. ఈ రెండు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లతో కూడిన రాడార్లను వినియోగించడం వల్ల భూమి ఉపరితలంలోని మార్పులను చదరపు సెంటీమీటర్ రేంజ్ వరకు కూడా స్పష్టంగా అంచనా వేయవచ్చు. ‘నిసార్’పై 2014లో ఇస్రో, నాసా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 2022లో శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగిస్తారు.
మిషన్ ఉపయోగాలు
అడవుల నరికివేత, మైనింగ్ తదితరాల వల్ల నేల, వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయన్న దాన్ని ఈ మిషన్ ద్వారా కనిపెట్టనున్నారు. దీంతో భూకంపాలు, సునామీ, అగ్ని పర్వతాల విస్పోటనం వంటి విపత్తులను ముందుగా గుర్తించి ప్రజలను హెచ్చరిస్తారు. ఈ మిషన్ మూడేండ్ల పాటు సేవలను అందించనున్నది.