న్యూఢిల్లీ: బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఓవైపు బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ప్రతి ప్రభుత్వ బ్యాంకును అమ్మేస్తామని అనడం సరికాదు. ఈ బ్యాంకుల కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న ఉద్యోగులను రక్షించుకుంటాం. వాళ్ల జీతాలు, పెన్షన్లకు రక్షణ కల్పిస్తాం అని నిర్మల అన్నారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ రెండు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఈ బ్యాంకులను ప్రైవేటైజ్ చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మల చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంక్లో మెజార్టీ వాటాను అమ్మేయగా.. మరో 14 బ్యాంకులను విలీనం చేసింది.