అల్లర్లకు కారకులైన వారు ఏస్థాయిలో ఉన్నా ఉపేక్షించం..
పుకార్లను నమ్మవద్దు.. అల్లరి మూకలతోనే సమస్య..
దేవారెడ్డి, మహిపాల్ కారు నిందితులను అరెస్టు చేశాం..
పరారీలో ఉన్న వారిని త్వరలో పట్టుకుంటాం.. ప్రత్యేక బృందాలు పెట్టాం..
సోషల్ మీడియాలో వచ్చే ఫొటోలు, వీడియోలు నమ్మవద్దు..
గ్రూప్ అడ్మిన్, పంపినవారిపై కేసులు పెడుతున్నాం..
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం..
నేరాలకు పాల్పడిన వారికి కచ్చితంగా శిక్షపడేలా చూస్తాం.
సమస్యాత్మక ప్రాంతాల్లో శాశ్వత సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం..
మత పెద్దలు యువకులకు దిశానిర్దేశం చేసి సన్మార్గంలో పెట్టాలి..
సమాజంలో శాశ్వత శాంతి నెలకొల్పేలా తోడ్పడాలి..
నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్
భైంసా, మార్చి 20: భైంసా పట్టణంలో మరోసారి అల్లర్లు పునరావృతం కాకుండా శాశ్వత కార్యాచరణ రూపొందిస్తున్నట్లు నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలో ఈ నెల 7 న జరిగిన అల్లర్లను గంటన్నర వ్యవధిలోనే అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి అల్లర్లకు కారణమైన అనుమానితులను అదుపులోకి తీసుకొని, ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశామని పేర్కొన్నారు. అల్లర్లకు కారకులు ఏ స్థాయిలో ఉన్నా, ఉపేక్షించబోమని తెలిపారు. పుకార్లను నమ్మి అల్లర్లలో భాగస్వాములు కావద్దని సూచించారు. భైంసా పట్టణానికి చెందిన దేవారెడ్డిని కొట్టిన నిందితులను, డా.మహిపాల్ కారును కాల్చిన నిందితుల్లో ఎండీ ఇమ్రాన్, సల్మాన్ఖాన్, ఎండీ మసూద్ హైమద్ను అరెస్టు చేశామని, మిగతా వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకునే వరకు పోలీసుల గాలింపు కొనసాగుతుందని స్పష్టం చేశా రు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని, ఆధారాలను కోర్టులో సమర్పించి దోషులకు కఠిన శిక్ష పడేటట్లు చూస్తామని పేర్కొన్నారు. ఇకపై సమస్యాత్మక ప్రాంతాల్లో శాశ్వతంగా సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మత పెద్దలు యువకులకు దిశానిర్దేశం చేసి సన్మార్గంలో పెట్టి సమాజంలో శాశ్వత శాంతి నెలకొల్పేలా తోడ్పాడాలని ఆయన కోరారు. ఈ నెల 23 వరకు భైంసా పట్టణంలో 144 సెక్షన్ కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు.