చెన్నై : ఏప్రిల్ 6న తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరూర్ నియోజకవర్గంలోని మావాడియన్ ఆలయ వీధిలో డీఎంకే, ఐఐఏడీఎంకే కార్యకర్తలు శనివారం రాత్రి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ నియోజకవర్గంలో డీఎంకే నుంచి వి. సెంథిల్ బాలాజీ, ఏఐఏడీఎంకే నుంచి రవాణాశాఖ మంత్రి ఎం.ఆర్.విజయభాస్కర్ పోటీలో ఉన్నారు.
ప్రచార సమయం ముగిసిన తర్వాత కూడా ఏఐఏడీఎంకే కార్యకర్తలు ప్రచారాన్ని కొనసాగిస్తుండటంపై డీఎంకే వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని అది ఘర్షణకు దారి తీసింది. కర్రలు, రాళ్లతో జరిగిన ఈ ఘర్షణలో ఏఐఏడీఎంకేకు చెందిన 16 మంది, డీఎంకేకు చెందిన ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. సాయుధ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బాధితులందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు.