‘భారతీయ పురాణేతిహాసాలు, చరిత్రలో ఎన్నో తెలియని రహస్యాలున్నాయి. వాటి ఆధారంగా కథల్ని తయారుచేసుకుంటే అద్భుత చిత్రాలవుతాయి’ అని అన్నారు నిఖిల్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ-2’. చందు మొండేటి దర్శకుడు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం నిఖిల్ పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు..?
కరోనా వల్లే ఇంత గ్యాప్ వచ్చింది. ‘కార్తికేయ-2’ మంచి విజువల్ ఫీల్తో ఉంటుంది. శ్రీకృష్ణుడు, ద్వారకా నగర నేపథ్యంలో కథ నడుస్తుంది. ఈ సినిమాను థియేటర్లో చూస్తేనే ప్రేక్షకులు కథతో సహానుభూతి చెందుతారు. అందుకే కరోనా లాక్డౌన్ సమయంలో ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చినా థియేటర్ రిలీజ్ కోసమే ఎదురు చూశాం. ఆ కారణంగానే సినిమా విడుదల ఆలస్యమైంది.
మొదటి భాగంతో పోల్చితే ఈ కథలో ఏ అంశాలు కొత్తగా ఉంటాయి?
2016లో చందు మొండేటి ఈ కథ చెప్పాడు. అద్భుతంగా అనిపించింది. సీక్వెల్ చేస్తే ఇలాంటి కథతోనే చేయాలనుకున్నా. ఫస్ట్పార్ట్లో నేను వైద్య విద్యార్థి కార్తికేయగా కనిపించాను. మూడేళ్ల తర్వాత డాక్టర్గా మారిన అతను ద్వారకా నగర రహస్యాన్ని తెలుసుకోవడానికి చేసిన సాహసభరిత యాత్రే ఈ సినిమా కథాంశం. మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది.
ఇందులో కృష్ణతత్వాన్ని ఏమైనా ఆవిష్కరించారా?
భారతీయ సనాతన ధర్మం, పురాణాల గొప్పతనాన్ని తెలియజేస్తూ భక్తిభావనలు కలబోసిన కథ ఇది. కేవలం హిందూ ధర్మం గురించే కాకుండా బౌద్ధం, ఇస్లాం, క్రైస్తవం అన్ని మతాల ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తుంది. పురాణాలు, చరిత్రను అనుసంధానిస్తూ కథాగమనం నడుస్తుంది. దేవుడి ఉనికి విషయంలో మనలో చాలా మందికి సందేహాలుంటాయి. దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఈ సినిమా ద్వారా శాస్త్రీయ దృక్కోణంలో తెలియజెప్పే ప్రయత్నం చేశాం. దానిని ప్రేక్షకులు ఎంతవరకు స్వీకరిస్తారన్నది వారి వ్యక్తిగత నమ్మకాలు, జ్ఞానాన్ని బట్టి ఉంటుందని భావిస్తున్నా.
మీరు దేవుణ్ణి నమ్ముతారా?
దైవం మానుష రూపేణా అనే సూక్తిని నేను బలంగా నమ్ముతాను. నాకు మంచి చేసే వ్యక్తిని దేవుడితో సమానంగా భావిస్తా. చెడు చేస్తే రాక్షసుడు అనుకుంటా. శేఖర్ కమ్ముల గారు నాకు సినీ జీవితాన్ని ప్రసాదించారు. ఆయన్ని నేను దేవుడిగానే భావిస్తా. ఇక యథార్థంలో మాత్రం సైంటిఫిక్ రీజనింగ్ ఆధారంగానే నా నమ్మకాలు ఉంటాయి.
మీరు నటించిన తొలి పాన్ ఇండియా చిత్రమిదే కదా..?
కృష్ణుడు నేపథ్య కథాంశం కాబట్టి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఈ ఇతివృత్తం కనెక్ట్ అవుతుందని భావించాం. అందుకే వివిధ భాషల్లో విడుదల చేస్తున్నాం. హిందీలో దాదాపు 150 స్క్రీన్స్లో రిలీజ్ అవుతున్నది.
మీ తదుపరి చిత్రాల గురించి..?
గీతా ఆర్ట్స్లో చేస్తున్న ‘18పేజీస్’ దాదాపు పూర్తికావొచ్చింది. ‘స్పై’ చిత్రం ముప్పైశాతం షూటింగ్ జరుపుకుంది. ఇది కూడా పాన్ ఇండియా కథాంశమే. సుధీర్వర్మ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్న ఓ సినిమాలో నటిస్తున్నా.