హైదరాబాద్: ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్
అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా ప్రతిఒక్కరు సందర్భమేదైనా మొక్కలు నాటుతూ హరిత సంకల్పంలో భాగమవుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు నాగబాబు కూతురు నిహారికా కొణిదెల గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని చెప్పారు. తన తండ్రి నాగబాబు ఎప్పుడు ప్రకృతిని ప్రేమించాలని, మొక్కలు పెంచాలని చెబుతూ ఉంటారని వెల్లడించారు.
ఈ ప్రపంచంలో అందరిని కాపాడే మొదటి దేవుడు ప్రకృతి అని.. అలాంటి ప్రకృతిని రక్షించుకునే బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ నిరంతరం కొనసాగడం చూస్తూ ఉన్నానని, ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ వారితో మొక్కలు నాటించడం మంచి చాలా బాగుందన్నారు. ప్రతీ ఒక్కరు ఈ చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఈ అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.