ముంబై : కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో నాగపూర్ నగరంలో లాక్డౌన్ విధించిన మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా కళ్యాన్-డొంబివ్లి, నందర్బర్ జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. కళ్యాణ్ ప్రాంతంలో 392 కరోనా వైరస్ కేసులు వెలుగుచూడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శివరాత్రి సందర్భంగా ఈనెల 11న ఈ ప్రాంతంలోని శివాలయాన్ని మూసివేయాలని కళ్యాన్-డొంబివ్లి జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది.
గురువారం నుంచి షాపులను కేవలం ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకే తెరవాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ విజయ్ సూర్యవంశీ పేర్కొన్నారు. రాత్రి కర్ఫ్యూ సమయంలో బార్లు, రెస్టారెంట్లలో 11 గంటల తర్వాత కస్టమర్లకు సర్వీసులు నిలిపివేయాలని ఆదేశించారు. ఎమర్జెన్సీ సేవలు, మందుల షాపులకు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చామని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ జిమ్లు, ఆడిటోరియంలు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్స్ పూల్స్ను మూసివేయాలని స్పష్టం చేశారు.