గువాహటి : కొవిడ్ కేసుల పెరుగుల నేపథ్యంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు నైట్కర్ఫ్యూ విధించింది. గత ఏడు రోజుల్లో 10 కరోనా కేసుల కంటే ఎక్కువగా నమోదైన ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో రాత్రి కర్ఫ్యూను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు, షోరూంలు, దుకాణాలు రాత్రి 8 గంటల వరకు మూసివేయాలని సర్కారు ఆదేశించింది. అయితే అత్యవసర సేవలు 24 గంటలు కొనసాగుతాయని చెప్పింది.
ప్రయాణికులు వ్యాక్సిన్ వేయించుకోవడంతోపాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సర్కారు సూచించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్, హయ్యర్ సెకండరీ, నర్సింగ్ కోర్సులు, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లలో ఫిజికల్ క్లాస్లకు హాజరయ్యేందుకు సింగిల్ డోసు టీకా వేసుకున్న విద్యార్థులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇందుకు విద్యార్థులు, అద్యాపకులు, సిబ్బందికి మూడు రోజుల ముందుగానే వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సినిమా థియేటర్లు మూసిసే ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. మంగళవారం అసోంలో 570 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షించగా.. ఐదుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,89,426కు పెరిగింది.