ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద ఇటీవల కలకలం రేపిన బాంబులతో కూడిన వాహనం కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ (ఏటీస్) నుంచి దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఏ తీసుకుంది. ఆ వాహనానికి సంబంధించిన మన్సుఖ్ హిరెన్ అనుమానాస్పద మరణంపై కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేయనున్నది.
ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసమైన యాంటిలియా వద్ద ఫిబ్రవరి 25న ఒక ఎస్యూవీ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా పేలుడు పదార్థాలైన జెలటిన్స్టిక్స్తోపాటు అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ ఒక లేఖ అందులో లభించాయి. ఆ వాహనం గురించి ముంబై పోలీసులు ఆరా తీయగా మన్సుఖ్ హిరెన్ అనే వ్యక్తి దానిని వినియోగించినట్లు గుర్తించారు. అయితే ఈ నెల 5న ఆయన అనుమానాస్పదంగా మరణించారు. ధాణే వద్ద కాలువలో హిరేన్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.
మరోవైపు మన్సుఖ్ చనిపోవడంతో ముఖేష్ అంబానీ భద్రతకు సంబంధించిన ఈ కేసులో పలు అనుమానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు కేంద్ర హోంశాఖ అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.