న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశ రాజధాని ఢిల్లీలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ సంబంధాలున్న ఓ వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని బత్లా హౌస్లో నివాసం ఉంటున్న సదరు వ్యక్తి ఐఎస్ఐఎస్లో క్రియాశీల సభ్యుడని అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. సదరు వ్యక్తిని బిహార్కు చెందిన మోహిసిన్ అహ్మద్గా గుర్తించారు. నగరంలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో మోసిన్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ.. గతకొద్ది రోజులుగా బత్లా హౌస్లో నివాసం ఉంటున్నాడు.
ఐఎస్ఐఎస్ సానుభూతి పరుల నుంచి నిధులను సేకరిస్తున్నాడని, ఇందుకు క్రిప్టోకరెన్సీని వినియోగిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఐఎస్ఐఎస్తో ఆన్లైన్లో సంబంధాలు నెరుపుతున్నాడని, జూన్ 25న క్షేత్రస్థాయి కార్యకలాపాలకు కూడా పాల్పడ్డాడని పేర్కొంది. ఈ మేరకు శనివారం బత్లా హౌస్లోని నివాసంపై దాడులు నిర్వహించగా.. నేరానికి సంబంధించి అనేక పత్రాలు లభ్యమయ్యాయి. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఆరోపణలను మోహిసిన్ కుటుంబం తోసిపుచ్చింది. దీన్ని కోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలిపారు.