తక్కువ ధరకే బియ్యం, చక్కెర, పప్పులు, పాలు వంటి నిత్యావసరాలు కావాలంటే మీరు ఏం చేస్తారు? ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే సూపర్ మార్కెట్ లేదా ఆన్లైన్ పోర్టల్ను వెదుకుతారు. తక్కువ ధరల్లో నిత్యావసరాలను కొనేందుకు న్యూజిలాండ్ ప్రజలు ఏకంగా పొరుగు దేశమైన ఆస్ట్రేలియాను ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే..
– నేషనల్ డెస్క్
పిండి, పండ్లు, బ్రెడ్డు, ఆల్మండ్స్, సబ్బులు, దుస్తుల కోసం న్యూజిలాండ్లోని ప్రజలు ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఆన్లైన్ గ్రాసరీ పోర్టల్స్లోకి లాగిన్ అవుతున్నారు. తమకు అవసరమైన వస్తువులను తక్కువ ధరలకే కొనుగోలు చేసి.. డెలివరీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి కారణం న్యూజిలాండ్లో మండుతున్న ధరలే.
గడిచిన మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా న్యూజిలాండ్లో ద్రవ్యోల్బణం 6.9 శాతానికి ఎగబాకింది. దీంతో పండ్లు, కూరగాయలు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇలా అన్నింటి ధరలు 7 నుంచి 10 శాతం, పెట్రోల్, డీజిల్ ధరలు 18 శాతం పెరిగాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగొచ్చని ఆర్థికమంత్రి గ్రాంట్ రాబర్ట్సన్ ఇటీవల పేర్కొన్నారు. దీంతో ధరాఘాతం నుంచి తప్పించుకోవడానికి అక్కడి పౌరులు పొరుగున ఉన్న ఆస్ట్రేలియా నుంచి నిత్యావసరాలతో పాటు వివిధ వస్తువులను ఆర్డర్ చేసుకొంటున్నారు.
న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి దూరం 2,225 కిలోమీటర్లు. అంత దూరం నుంచి వస్తువులను డెలివరీ చేయాలంటే ఛార్జీలు తడిసి మోపెడవుతాయి. అందుకే, న్యూజిలాండ్లోని వివిధ నగరాల్లోని ప్రజలు సోషల్మీడియాలో కమ్యూనిటీలుగా ఏర్పడుతున్నారు. తమకు అవసరమైన వస్తువులను బల్క్గా తెప్పించుకొంటున్నారు. దేశంలోని ధరలతో పోలిస్తే, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకొంటున్న వస్తు ధరలు చాలా తక్కువగా ఉంటున్నాయని, జీఎస్టీ, కస్టమ్స్ ఫీజు, ఎయిర్లైన్స్ ఛార్జీలు కలిపినప్పటికీ దాదాపు 35% డబ్బు ఆదా అవుతున్నట్టు ఓ మహిళ తెలిపారు.