బెంగళూరు : కరోనా సెకండ్ వేవ్ మధ్య యువకులు, మధ్య వయస్కులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తేలింది. మొదటి వేవ్లో వృద్ధులపై ప్రభావం చూపగా.. ఇప్పుడు పెద్దగా వారిలో తీవ్రత కనిపించడం లేదని బెంగళూరు వైద్యులు గుర్తించారు. మార్చి మధ్య నాటి నుంచి కరోనా కేసులు పెరిగిన నాటి నుంచి బెంగళూరులో వైరస్ పాజిటివ్గా పరీక్షించిన వారిలో 20-39 మధ్య వయస్సున వ్యక్తులే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ నెల 17 నుంచి 26వ తేదీల మధ్య 20-29 సంవత్సరాల వయస్సున్న వారు 2,408 మంది, 30-39 సంవత్సరాల వయస్సున 2,547 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షించినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలికే డేటా పేర్కొంది. 60-69 మధ్య 1,178 మంది, 70 ఏళ్లు పైబడిన వారిలో 828 మంది వైరస్ బారినపడ్డారు. వైరస్ ట్రాన్మిసిబిలిటీ పెరగడం, ప్రజల ప్రవర్తనే ఈ పరిస్థితికి దారి తీసిందని వైద్యులు పేర్కొంటున్నారు.
ఆస్టర్ సీఎంఏ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ బ్రూన్డా మాట్లాడుతూ 35-40 ఏళ్ల వయస్సున్న చాలా మందికి వైరస్ బారినపడడం చూస్తున్నామన్నారు. ఇందులో ఎక్కువగా జలుబు, జ్వరం, దగ్గు మొదలైన లక్షణాలతో కేసులు వస్తున్నాయని, మొదటి వేవ్తో పోలిస్తే ప్రసార రేటు ఎక్కువని, లాక్డౌన్తో వైరస్ వ్యాప్తిని పరిమితం చేసిందని పేర్కొన్నారు. అయితే సెకండ్ వేవ్లో టీకా అందుబాటులోకి రావడంతో ప్రజల కదలిక ఎక్కువై.. ప్రసార రేటు పెరిగిందని చెప్పారు. టీకాలు వేయడంతో వృద్ధుల్లో సంక్రమణ రేటు తగ్గిపోవచ్చునని.. కానీ, చాలా మంది మధ్య వయస్సులు వైరస్ బారినపడుతున్నట్లు చూస్తున్నందున టీకా వేసేందుకు 35 సంవత్సరాలకు తగ్గించడాన్ని కేంద్రం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. జయానగర్లోని మణిపాల్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసన్ కన్సల్టెంట్ డాక్టర్ అరవింద జీఎం మాట్లాడుతూ 20-30 మధ్య వయస్సుల్లో 10 నుంచి 20శాతం పెరుగుదల అంచనా వేశారని, ఇందులో చాలా మందికి జీర్ణాశయాంతరలక్షణాలున్నాయని పేర్కొన్నారు. కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
యశ్వంత్పూర్లోని కొలంబియా ఆసియా రెఫరల్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రదీప్ రంగప్ప మాట్లాడుతూ.. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా హాస్పిటళ్లలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని, కానీ రాబోయే కొద్ది వారాల్లో ఐసీయూ, హాస్పిటల్కు వచ్చే వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయన్నారు. మొదటి వేవ్లో చూసిన విధంగానే మరణాలు చూడాల్సి వస్తుందని.. అలాంటి దశలోకి వెళ్లకుండా చూసుకోవాలన్నారు. ఐసీయూ పడకలు పెంచడం ప్రారంభించాలని, టీకాలు అందుబాటులో ఉంచాలన్నారు. చాలా ఆసుపత్రులు కొవిడ్ రోగులను అనుమతించడం లేదని, కేంద్రీకృత మేనేజ్మెంట్ వ్యవస్థను ప్రభుత్వం తిరిగి అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని డాక్టర్ రంగప్ప అభిప్రాయపడ్డారు.