2020లో ఉన్నట్టుండి చాలామంది బరువు పెరిగిపోయారు. ఊబకాయులుగా మారిపోయారు. దీనికి కారణం కొవిడ్-19 అని పరిశోధకులు తేల్చారు. 2019తో పోలిస్తే 2020లో బరువు పెరిగిన వారి సంఖ్య చాలా అధికమని వారు అంచనావేశారు. జాతీయ సర్వే ఆధారంగా ఈ షాకింగ్ విషయాన్ని కనుగొన్నారు అమెరికా పరిశోధకులు. ఈ అధ్యయన ఫలితాలు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ప్రచురితమయ్యాయి.
2020లో కొవిడ్ మొదటివేవ్ వల్ల లాక్డౌన్ విధించారు. దీంతో చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉంటూ ఎక్కువగా తినడంతోపాటు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నారు. సర్వే ప్రకారం 3.5 మిలియన్ల కంటే ఎక్కువ మంది యూఎస్ యువత (20లేదా అంతకంటే ఎక్కువవయస్సుగలవారు) ఒబేసిటీ బారినపడ్డారు. గతంతో పోలిస్తే 2020లోనే 3శాతం అధికబరువు పెరిగారు. వ్యాయామం చేయకపోవడం, ఎక్కువగా నిద్రపోవడం, ఎక్కువగా మద్యం తాగడం, ధూమపానం సేవించడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రధాన పరిశోధకుడు, బ్రాండన్ జే రెస్ట్రెపో తెలిపారు. తమ పరిశోధనా ఫలితాలు ఒబెసిటీపై అమెరికా సర్కారును అప్రమత్తం చేస్తాయని చెప్పారు.