బకెట్ క్లీనింగ్ సిస్టమ్తో సీవరేజీ లైన్లు క్లియర్
వానకాలం వచ్చేలోగా పనులు పూర్తి
ఖైరతాబాద్, మే 24 : వర్షాకాలం వచ్చిందంటే ఖైరతాబాద్ సర్కిల్లోని పలు కాలనీల్లో మురుగు పొంగిపొర్లుతుంది. నాలాల డీసిల్టింగ్ చేపట్టినప్పటికీ వర్షపునీరు వెళ్లే లైన్లలో వ్యర్థాలు పేరుకుపోయి ఆయా కాలనీలు జలమయమవుతుటాయి. అలాంటి సమస్యను కూడా పరిష్కరించేందుకు బకెట్ క్లీనింగ్ పద్ధతిని జీహెచ్ఎంసీ తీసుకొచ్చింది. ఈ పద్ధతిలో పైపులైన్లలో పేరుకుపోయిన వ్యర్థాలు, మట్టి, త్తాచెదారాన్ని యంత్రం సాయంతో తొలగించి నీటిని క్రమబద్ధీకరిస్తారు. సర్కిల్లో ఇప్పటికే పలు డివిజన్లలో ఈ పనులు ప్రారంభం కాగా, వర్షాకాలంలోగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సిల్ట్ మిషన్ సాయంతో….
సీవరేజీ, డ్రైనేజీ లైన్లలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు ప్రస్తుతం బకెట్ క్లీనింగ్ పద్ధతులు వినియోగిస్తున్నారు. చిన్న చిన్న కాలనీలు, బస్తీల్లో పైపుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించవచ్చు. బకెట్ క్లీనింగ్కోసం సిల్ట్ మిషన్ను ఉపయోగిస్తారు. ఆ మిషన్కు వైరుతో అనుసంధానంగా ఉన్న బకెట్ను కర్ర సాయంతో సీవరేజీ లైన్లలోకి పంపించి వ్యర్థాలు, చెత్త చెదారాన్ని వెలికి తీస్తారు. తద్వారా తక్కువ సమయంలో క్లీనింగ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 6 నుంచి 8 ఇంచుల బకెట్ను క్లీనింగ్ కోసం వినియోగిస్తున్నారు. సర్కిల్-17లోని ఖైరతాబాద్, సోమాజిగూడ, అమీర్పేట్, సనత్నగర్ డివిజన్లలో నాలుగు సిల్ట్ మిషన్లను వినియోగిస్తున్నారు. ఒక్కో వార్డుకు రూ.8లక్షల చొప్పున వెచ్చిస్తున్నారు.
వర్షాకాలంలోగా పూర్తి చేస్తాం
– చైతన్య, జీహెచ్ఎంసీ డీఈ
గత నెల రోజులుగా ఈ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు ఖైరతాబాద్ పెట్రోల్ బంక్, నిమ్స్ హాస్పిటల్, ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్, రాజ్నగర్, ఎంఎస్, బీఎస్ మక్తా, శ్రీనివాస్ కాలనీ వెస్ట్ తదితర కాలనీల్లో నిర్వహించాం. మిగతా కాలనీల్లోనూ వర్షాకాలం లోగా బకెట్ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేస్తాం.