హైదరాబాద్ : నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో టీచర్ల కొరత సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం 937 పోస్టులను మంజూరుచేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్, అండ్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ మంగళవారం జీవో 1321ని జారీచేశారు. వీరిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకునేందుకు అనుమతినిచ్చారు. వీరిని నియమించేందుకు విద్యాశాఖ అధికారులు త్వరలోనే రిక్రూట్మెంట్ టెస్ట్ను నిర్వహించాలని భావిస్తున్నారు. పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన వీటిని భర్తీచేయనున్నారు.
కేజీబీవీ పోస్టులతో పాటు, పాఠశాల విద్యాశాఖ పరిధిలో 4,386 ఉద్యోగులను కొనసాగించేందుకు సైతం అనుమతినిచ్చారు. తెలంగాణ మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్న 397 వోకేషనల్ ట్రైనీస్ అండ్ వోకేషనల్ కో ఆర్డినేటర్లు, 1,435 అవర్లీ బేస్డ్ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రభుత్వ, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న 2,343 పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్లు, ప్రభుత్వ బీఈడీ కాలేజీలు, డైట్కాలేజీల్లో 211 గెస్ట్ ఫ్యాకల్టీని కొనసాగించేందుకు అనుమతినిచ్చారు. వీరిని 2022 ఏప్రిల్ 30 వరకు కొనసాగించేందుకు జీవో ద్వారా అనుమతినిచ్చారు.