హైదరాబాద్, మార్చి 22(నమస్తే తెలంగాణ): ప్రాథమిక పాఠశాలల్లో అదనపు ప్రధానోపాధ్యాయ (స్కూల్ అసిస్టెంట్ల సమానస్థాయి) పోస్టులను మంజూరుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయంతో 5,793 ప్రాథమిక పాఠశాలలకు కొత్త హెచ్ఎంలు పెరుగనున్నారు. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు కలుపుకొని వీటిసంఖ్య 10 వేలకు చేరనున్నది.
ఏకోపాధ్యాయ పాఠశాలలే ఎక్కువ
ప్రైమరీ స్కూలులో సీనియర్ ఎస్జీటీలే ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరించేవారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అన్నీ ఒక్కరే చూసుకునేవారు. విద్యాబోధనతోపాటు, మధ్యాహ్న భోజనం, రిజిస్టర్ల నిర్వహణ, స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలు అన్నింటినీ ఒక్కరే పర్యవేక్షించేవారు. తెలంగాణలో మొత్తంగా 18,240 ప్రాథమిక పాఠశాలలుండగా.. అత్యధికంగా సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్లే ఉన్నాయి. బాలికల అక్షరాస్యత తక్కువగా ఉన్న పాఠశాల్లో 4,207 స్కూళ్లకు మాత్రమే హెచ్ఎం పోస్టులున్నాయి. వీటిల్లో ప్రస్తుతం1,821 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలన్న విద్యాహక్కు చట్టం నిబంధన ప్రకారం 5 వేల స్కూళ్లకు సింగిల్ టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రాథమిక పాఠశాలకు హెచ్ఎం పోస్టును మంజూరుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.