న్యూఢిల్లీ: మలేరియాను దేశం నుంచి శాశ్వతంగా నిర్మూలించేందుకు సరికొత్త పరిష్కారం కోసం అన్వేషణ మొదలైంది. వాతావరణ ఆధారిత పరిష్కారం (క్లైమేట్ బెస్డ్ సొల్యూషన్) అన్వేషణ కోసం ఓ నిపుణుల కమిటీ ఏర్పాటు కానుంది. ఇందుకోసం భారత వాతావరణ శాఖ (ఐఎండీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సోమవారం ప్రభుత్వేతర సంస్థ అయిన “మలేరియా నో మోర్”తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
మలేరియా, వాతావరణంపై ఇండియా ఇంటరాజెన్సీ ఎక్స్పర్ట్ కమిటీ (ఐఈసీ) అని దీనికి నామకరణం చేశారు. ఇందులో ఆరోగ్యం, వాతావరణం, సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖ నిపుణులు, పరిశోధకులుంటారు. 2030నాటికి మలేరియాను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ కమిటీ వాతావారణ ఆధారిత పరిష్కారాలను అన్వేషిస్తుంది. ఒడిశా రాష్ట్రంలో మలేరియా నో మోర్ అభివృద్ధి చేసిన నమూనాలను మెరుగుపరచడంపై ఐఈసీ దృష్టి సారించనుంది.