హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో వాయు, శబ్ద కాలుష్యాలను అరికట్టవచ్చని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రో త్సహించేందుకే తెలంగాణ ఎలక్ట్రిక్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీని తీసుకొచ్చినట్టు చెప్పారు. పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారుచేసిన త్రీ సీటర్ ఎలక్ట్రికల్ ప్యాసింజర్ ఆటో, గూడ్స్ ట్రాలీ ఆటోలను మంగళవారం ఖైరతాబాద్లోని రవాణాశాఖ కార్యాలయంలో ప్రా రంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ-వెహికిల్ పాలసీలో భాగంగా వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి రాయితీలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఫస్ట్కమ్ ఫస్ట్ సర్వ్ కింద ముందుగా కొనుగోలు చేసేవారికి రిజిస్ట్రేషన్ ఫీజు, క్వార్టర్లీ ట్యాక్స్లో మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.264 కోట్లు భారమైనా పర్యావరణ పరిరక్షణ కోసం దానిని భరిస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రికల్ వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు.
ఇప్పటివరకు 300కుపైగా ట్రాలీ ఆటోలు, 26 ప్యాసింజర్ ఆటోల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని వివరించారు. ఒకసారి చార్జింగ్తో 110 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని తెలిపారు. కమర్షియల్ చార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు, జేటీసీలు రమేశ్, మమత, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కే పాపారావు, పియాజియో కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.