నా రాష్ట్రమే నీకు నచ్చనప్పుడు.. నా ఓటు నీకెందుకు? ఇది ఓ నెటిజన్ ప్రధానికి వేసిన సూటి ప్రశ్న! ‘మోదీకి తెలంగాణ అంటే కుళ్లు.. అభివృద్ధిలో గుజరాత్ను మించిపోతున్నదనే అక్కసు. దానిని అలా వెళ్లగక్కారు’ అనేది మరొకరి సెటైరిక్ పంచ్! ‘దేశ్ కో బచావో.. బీజేపీ కో భగావో’ అంటూ మండిపడింది కొందరు.. ‘రాష్ర్టానికి అండగా టీఆర్ఎస్.. దేశానికి దండగ బీజేపీ’ అని తేల్చేసింది మరికొందరు! ‘మోదీ తెలంగాణకే కాదు.. యావత్ భారతానికి శత్రువు’ అంటూ తెగేసి చెప్పింది ఇంకొకరు! ‘ఖబడ్దార్ తెలంగాణ బీజేపీ నాయకుల్లారా? మా తెలంగాణ బిడ్డల ఆత్మత్యాగాలను అవహేళన చేస్తారా? తెలంగాణ ఏర్పాటుపై చట్టసభల్లో మోదీ విషం చిమ్ముతున్నా నోరు మెదపని చేతకాని సన్నాసులు తెలంగాణ బీజేపీ నేతలు’ అంటూ రాష్ట్ర బీజేపీ నేతల తీరును నగ్నంగా నిలబెట్టింది ఎందరో!! ఒక్కొక్కరిది.. ఒక్కో పంచ్! బీజేపీ నేతల ముఖం పచ్చడైపోయేలా!
హైదరాబాద్, ఫిబ్రవరి 10 : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై ఇక్కడి సిటిజనులే కాదు దేశవ్యాప్తంగా ఉన్న నెటిజనులు భగ్గుమంటున్నారు. ‘మోదీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ’ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చి నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. మోదీ తీరును దుయ్యబట్టే ఎమోజీలు హంగామా చేశాయి. ‘తెలంగాణ లవ్స్ మోదీ’ అనే హ్యాష్ట్యాగ్తో కమలనాథులు చేసిన ప్రయత్నాలు ‘మోదీఎనిమీఆఫ్తెలంగాణ’ ముందు దూదిపింజల్లా కొట్టుకుపోయాయి. ప్రస్తుతం నెట్టింట్లో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇటీవలి కాలంలో కమలంపై విమర్శల దాడి పెరిగిపోయింది. తెలంగాణ సమాజం చేపట్టిన ప్రతి కార్యక్రమానికీ, ఇస్తున్న ప్రతి పిలుపునకూ జాతీయస్థాయిలో మద్దతు పెరుగుతుండటమే అందుకు నిదర్శనం. అదే సమయంలో ప్రజల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకత కూడా నెట్టింట్లో బయటపడుతూ వస్తున్నది. ‘టీఆర్ఎస్విత్ఫార్మర్స్’ అనే హ్యాష్ట్యాగ్ నవంబర్ 11న ట్రెండింగ్ కాగా, దాదాపు 50.5 వేల మంది మద్దతు తెలిపారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు. డిసెంబర్ 21న ట్విట్టర్లో ‘యాంటిఫార్మర్బీజేపీ’ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. మొత్తంగా 22.6 వేల మంది ట్వీట్ చేశారు. ఇక ఈ నెల 5న మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా ‘ఈక్వాలిటీఫర్తెలంగాణ’ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. 41.2 వేల మందికిపైగా ఆ రోజు బీజేపీ, ప్రధాని మోదీపై నిరసన తెలిపారు. తాజాగా మోదీ వ్యాఖ్యలపై గతంలోకంటే రెట్టింపు స్థాయిలో బీజేపీపై నెటిజన్లు మండిపడ్డారు. ‘మోదీఎనిమీఆఫ్ తెలంగాణ’ హ్యాష్ట్యాగ్తో తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఏకంగా 56.6 వేల మంది ట్వీట్లు చేశారు. సాధారణంగా సోషల్ మీడియాలో జరిగే చర్చలో మహిళలు తక్కువగా స్పందిస్తుంటారు. కానీ మహిళలు సైతం మోదీని విపరీతంగా ట్రోల్ చేస్తుండటం గమనార్హం. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తూ అప్రజాస్వామికంగా రాష్ట్ర విభజన చేపట్టారని వ్యాఖ్యానించి తెలంగాణపై విద్వేషాన్ని వెళ్లగక్కారు. దీనిపై తెలంగాణ సమాజం ఆగ్రహంతో రగిలిపోతున్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సిటిజన్స్ ‘మోదీఎనిమీఆఫ్తెలంగాణ’ హ్యాష్టాగ్తో ట్విట్టర్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ధర్మాగ్రహానికి జాతీయస్థాయిలో కూడా మద్దతు వెల్లువెత్తుతున్నది. మోదీ వ్యాఖ్యలపై నెటిజన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు, విమర్శలు గుప్పిస్తున్నారు.
నా రాష్ట్రమే నచ్చనప్పుడు నా ఓటు మీకెందుకు..?
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఎమోజీలతో విమర్శలను గుప్పిస్తున్నారు. ‘మోదీకి తెలంగాణ అంటే కుళ్లు.. అభివృద్ధిలో గుజరాత్ను మించిపోతున్నదనే అక్కసు. దానిని అలా వెళ్లగక్కారు’ అంటూ సెటైరిక్గా పంచ్లు వేస్తున్నారు. మరికొందరు ‘రాష్ర్టానికి అండగా టీఆర్ఎస్.. దేశానికి దండగా బీజేపీ’, ‘మోదీ తెలంగాణకే కాదు.. యావత్ భారతానికి శత్రువు’ అంటూ రెచ్చిపోతున్నారు. ఇంకొందరయితే ‘తెలంగాణ ద్రోహులంతా ఒక్కటై మరోసారి విషం చిమ్ముతున్నారు’, ‘మోదీ దొంగల బండి యమజోరు మీద ఉందండి’, ‘నా రాష్ట్రమే నీకు నచ్చనప్పుడు నా ఓటు నీకెందుకు?’ అంటూ నిలదీస్తున్నారు. తెలంగాణవాదులైతే ‘ఖబడ్దార్ తెలంగాణ బీజేపీ నాయకుల్లారా? మా తెలంగాణ బిడ్డల ఆత్మత్యాగాలను అవహేళన చేస్తారా? తెలంగాణపై చట్టసభల్లో మోదీ విషం చిమ్ముతున్నా నోరు మెదపని చేతకాని సన్నాసులు తెలంగాణ బీజేపీ నేతలు’, ‘నో వోట్ టు బీజేపీ’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. గత రెండురోజులుగా ఇదే అంశం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నది. ప్రస్తుతం జాతీయస్థాయిలో ఏ పార్టీకీ కూడా లేనంతగా కమలం పార్టీకి సోషల్మీడియాపై బలమైన పట్టు ఉన్నది. బీజేపీ సోషల్ మీడియాతో తిమ్మిని బమ్మి చేస్తున్నదనే విమర్శలు, ఆరోపణలు కూడా తీవ్రస్థాయిలోనే ఉన్నాయి. అయినా.. జాతీయ స్థాయిలో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.