ప్రధానిపై కట్టలు తెంచుకొన్న నెటిజన్ల ఆగ్రహం
ఒక్క హ్యాష్ట్యాగ్పైనే గంటలో 25 వేల పోస్టులు
4 కోట్ల మంది చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేస్తారా
‘మూడింది ఓ మోడీ.. మా రాష్ట్రం మీదనా నీ దాడి.. మా రాష్ట్ర ప్రజల దృష్టిలో నువ్వో కేడీ.. మీ పార్టీని చేస్తారు ఇక పకోడి.. మోడీ.. నువ్వో బోడి.. దేశమంతా అయ్యింది రూడీ’ – మోదీపై ఓ నెటిజన్ ఆగ్రహం ఇది
హైదరాబాద్, ఫిబ్రవరి 9 : ప్రధాని నరేంద్రమోదీపై నెటిజన్లు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ.. ఏందిది?.. తెలంగాణ పుట్టుకను అవమానిస్తారా? తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడాన్ని తట్టుకోలేక అక్కసు వెళ్లగక్కుతారా? అంటూ సోషల్ మీడియాలో మండిపడ్డారు. తెలంగాణకు మోదీ శత్రువు అని, తెలంగాణ అంటేనే మోదీకి ద్వేషమని పేర్కొంటూ ‘మోదీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ’, ‘మోదీ హేట్స్ తెలంగాణ’ హ్యాష్ట్యాగ్లతో పోస్టుల వరద పారింది. ముఖ్యంగా ‘మోదీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ’ హ్యాష్ట్యాగ్పై తెలంగాణ ప్రజలు గంటలోపే 25 వేల పోస్టులు పెట్టారు. ఈ హ్యాష్ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్లో నిలిచి దేశం దృష్టిని ఆకర్షించింది.‘వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వరు. జీఎస్టీ బకాయిలు ఎగ్గొడతారు. విద్యాసంస్థలు మంజూరు చేయరు. మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు నిధులు లేవు. తెలంగాణ ఈ దేశంలో లేనట్టు వివక్ష చూపిస్తున్న బీజేపీని తెలంగాణలో సహిద్దామా?’ అని ఓ నెటిజన్ రాష్ట్ర ప్రజలను ప్రశ్నించారు. ‘రాష్ట్ర ఏర్పాటు నచ్చని మోదీ పార్టీ బీజేపీని తెలంగాణలో బతకనిద్దామా?’ అని ఒకరు ప్రశ్నించగా.. ‘బీజేపీ హఠావో.. దేశ్ కో బచావో’ అని మరొకరు పిలుపునిచ్చారు. ‘1969 నుంచి 2014 దాకా చేసిన చర్చలు, సంప్రదింపులు సరిపోవా?’ అని మరో నెటిజన్ నిలదీశారు. ‘తెలంగాణ ప్రజల ఆగ్రహానికి బీజేపీ మాడి మసైపోతది’ అని మరొకరు హెచ్చరించారు.
బీజేపీ ఎంపీలపైనా ఫైర్
మోదీ వ్యాఖ్యలకు మద్దతు పలికిన బీజేపీ ఎంపీలపైనా నెటిజన్లు విరుచుకుపడ్డారు. తెలంగాణవాసులై ఉండి రాష్ట్ర ఏర్పాటును అవమానించిన వ్యక్తికి మద్దతు పలుకుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దశాబ్దాలుగా జరిగిన చర్చలు, వేసిన కమిటీలు, చేసిన వాగ్దానాలు, పోయిన ప్రాణాలు సరిపోలేదంట. ఇంకా చర్చలు జరగాల్సిన అవసరం ఉండే అంట. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ఇలాంటి తెలంగాణ ద్రోహులు మన ఎంపీలు అవడం మన దౌర్భాగ్యం’ అంటూ ఓ నెటిజన్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేశారు. ‘మీ పార్టీ అధినాయకత్వం తెలంగాణ ఏర్పాటు తీరును, అమరవీరుల ప్రాణ త్యాగాలను, తెలంగాణ అస్థిత్వాన్ని అవమానించేలా మాట్లాడుతుంటే.. మీకు ఆ పదవులు అవసరమా? మీరు ఎలాగూ తెలంగాణకు రూపాయి పనిచేయరు. వెంటనే రిజైన్ చేయండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీరామరక్షగా కేసీఆర్
‘మా కేసీఆర్ సార్ ఉన్నంత కాలం మీరేం చేసినా నడువది. తెలంగాణకు శ్రీరామరక్ష టీఆర్ఎస్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఎత్తుకున్న రాష్ట్ర సాధన పని ఎంత కష్టమైనదో తెలిసీ.. దాని లోతెంతో తెలిసీ.. చాలా మంది కిందికి లాగుతుంటారు అని తెలిసీ.. అన్ని త్యాగాలకు సిద్ధపడి ముందడుగు వేసిన సాహసవంతుడు కేసీఆర్’ అని ఒక నెటిజన్ తన అభిమానాన్ని చాటుకొన్నారు.