హైదరాబాద్, మే 14, (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను నెటిజన్లు చెడుగుడు అడుకొన్నారు. సినిమా క్లిప్పింగ్లు, పంచ్ డైలాగ్లు, మీమ్స్తో బీజేపీ నేతలను ట్రోల్ చేశారు. తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే నైతికహక్కు ఎక్కడిదని అమిత్షాను సూటిగా ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదని, అమిత్షా చేతులు ఊపుకుంటూ వచ్చారని ఒక నెజిటిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ తెలంగాణ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘అమిత్ షా ఆగమనం’ శీర్షికతో చేసిన ట్వీట్పై నెటిజన్లు ఘాటుగా స్పందించారు.
‘తెలంగాణకు ఏమీ ఇవ్వరా? తెలంగాణ ఓట్లు కావాలా?’ అని ఒక నెటిజన్ నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వరు. ఐఐఎం ఇవ్వరు. అయినా తెలంగాణ ఓట్లు కావాలా? అని ప్రశ్నించారు. మీ వల్ల తెలంగాణకు ఒక్క రూపాయి ప్రయోజనమైనా చేకూరిందా? అని మరో నెటిజన్ నిలదీశారు. మీ వల్ల, మీ పార్టీ వల్ల తెలంగాణకు ఒక మంచి పని అయినా జరిగిందా? తెలంగాణ గడ్డపై అడుగు పెట్టే నైతిక హక్కు మీకు ఉన్నదా? అని మరో నెటిజన్ కడిగేశారు.
అమిత్జీ.. ఎప్పటి మాదిరిగానే చేతులు ఊపుకుంటూ కేవలం రాజకీయాలు చేయడానికే తెలంగాణకు రాకండని మరో నెటిజన్ హితవు పలికారు. మీరు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా ఇక్కడ నడవదు. ఇది కేసీఆర్ అడ్డా.. అని మరో నెటిజన్ హెచ్చరించారు. రాజకీయ టూరిస్టులు వస్తుంటారు.. పోతుంటారు.. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూడటానికి.. అని మరో నెటిజన్ చురకలు అంటించారు. తెలంగాణకు ఏమి చేస్తారో చెప్పండి.. లత్కోర్ మాటలు కాదని మరో నెటిజన్ నిప్పులు చెరిగారు. దేశంలో తుగ్లక్ పాలన నడుసున్నది. మరి దాన్ని ఏమంటారు? అని ప్రశ్నించారు. మీ దరిద్రపు పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారు. మీకు శ్రీలంక పాలకులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.