కఠ్మాండూ: పొరుగు దేశమైన నేపాల్లో కరోనా కరాళనాట్యం చేస్తున్నది. 47 శాతం పాజిటివిటీ రేటుతో నేపాల్ తల్లడిల్లతున్నది. రోజువారీ కేసుల సంఖ్య 9 వేలకు చేరుకుంటున్న నేథ్యంలో అధికారులు చేతులెత్తేస్తున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3.6 లక్షలకు, మరణాల సంఖ్య 3,529కి చేరుకుంది. అసమర్థత ఆరోపణలు ఎదుర్కొంటున్న కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం తక్షణ అంతర్జాతీయ సాయం కోసం అభ్యర్థనలు పంపుతున్నది. మరోవైపు కరోనా నుంచి దేశాన్ని గట్టెక్కించే బాధ్యతను సైన్యానికి అప్పగించింది. వ్యాక్సిన్లకు తీవ్ర కొరతగా ఉంది. ఆస్పత్రి బెడ్లు సరిపోవడం లేదు. ముఖ్యంగా రాజధాని కఠ్మాండీతోపాటుగా పశ్చిమ, నైరుతి ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. పాజిటివిటీ కొన్న చోట్ల సగం కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆస్ట్రజెనెకా మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు దొరకడం లేదు. దీంతో అర్జంటుగా టీకాలు పంపమని అంతర్జాతీయ సమాజాన్ని ఓలీ వేడుకుంటున్నారు. భారత్ నుంచి తిరిగివస్తున్న వలస కార్మికుల నుంచి కరోనా వ్యాపిస్తున్నదని అంటున్నారు. సుమారు 3 కోట్ల జనాభా కలిగిన నేపాల్ లో 1600 ఐసీయూలు, 600 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. భారత్ తరహాలోనే నేపాల్ కూడా మతపరమైన ఉత్సవాలను అనుమతించడం కొంపముంచిందని అంటున్నారు.