ఖాట్మాండు : నేపాల్ ప్రభుత్వం ఆ దేశ పౌరులకు ఆదివారం పలు హెచ్చరికలు జారీ చేసింది. స్నేహపూర్వక దేశాలతో సంబంధాలను ప్రభావితం చేసే సిగ్గుమాలిన చర్యలకు పాల్పడొద్దని సూచించింది. నేపాల్లో కొందరు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఈ మేరకు నేపాల్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘గత కొద్ది రోజులుగా నినాదాలు, ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాల ద్వారా పొరుగుదేశం ప్రధాని ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలపై నిఘా ఉంచాం’ అని పేర్కొంది. ఈ సందర్భంగా సదరు నేతలపై పేర్లు పేర్కొన లేదు కానీ.. ఖండిచదగ్గ, అవమానకరమైన చర్యలు నివారించాలని పౌరులకు గట్టి హెచ్చరికలు పంపింది. సత్సంబంధాలున్న దేశాలను లక్ష్యంగా చేసుకొని ఏదైనా కార్యకలాపాలు చేపడితే నియంత్రించడంతో పాటు చట్టవిరుద్ధమైన ఘటనలకు పాల్పడిన వారిని శిక్షిస్తామని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
భారత్లో ధార్చులాలో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ నేపాల్కు చెందిన జై సింగ్ ధామి అనే యువకుడు జూలై 30న మహాకాళి నదిలో పడి మృతి చెందాడు. యువకుడికి మరణానికి భారత భద్రతా దళాలే కారణమంటూ నేపాల్లో స్థానికులు ఆరోపించారు. యువకులు వైరస్ సహాయంతో నదిని దాటుతున్నప్పుడు ఎస్ఎస్బీ వైరస్ను కత్తిరించిందని ఆరోపిస్తుండగా.. అయితే.. వాటిని ఎస్ఎస్బీ ఖండించింది. నేపాల్లో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన యూత్ వింగ్, స్టూడెంట్ వింగ్ కార్యకర్తలు ఘటనపై నిరసన తెలుపడంతో పాటు భారత ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో నేపాల్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరిక ప్రకటన జారీ చేసింది. మన స్నేహపూర్వక దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలని తాము కోరుకుంటున్నామని, ఆయా దేశాల గౌరవాన్ని దెబ్బతీసే కార్యకలాపాలను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం పేర్కొంది.