నాగర్ కర్నూల్ : ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందన్న నెల్సన్ మండేలా మాటలను స్ఫూర్తిగా తీసుకొని సీఎం కేసీఆర్ విద్యకు విశేషమైన ప్రాధాన్యత కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
శుక్రవారం జిల్లాలోని అమ్రాబాద్ మండలంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల అమ్రాబాద్ లో ఏర్పాటు చేసిన ‘మన ఊరు మన బడి’ , ‘మన బస్తీ మన బడి’ అవగాహన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. విద్యతో సమాజమే మారుతుందన్నారు.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. ఇందుకోసం 7 వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు మంత్రి తెలియజేసారు.
మన ఊరు మన బడి కార్యక్రమానికి తమవంతు సహకారం అందించడానికి దాతలు సైతం ముందుకు రావాలని, అందరి భాగస్వామ్యం ఉంటే మరింత బాగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
డిగ్రీ కళాశాల భవనం నిర్మించడానికి స్థలం దానం చేసిన వీరయ్య దంపతులు, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేసిన నర్సింగ్ రావును మంత్రి సన్మానించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ పి. రాములు, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, జెడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, డి.సి.సి.బి చైర్మన్ నిజాంపాషా తదితరులు ఉన్నారు.