మహబూబ్నగర్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ పట్ల నిర్లక్ష్యం వహించిన కోయిలకొండ మండలం తాసిల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శి, ఎంపీహెచ్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు ఆదేశించారు. కొవిడ్ వాక్సిన్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంపై శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కాగా కోయిల్కొండ మండల కేంద్రం పరిధిలో ప్రతిరోజు వంద మందికి టీకా ఇవ్వాల్సి ఉంది. పరిశీలనకు వెళ్లిన రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామరావుకు 9 మందికి మాత్రమే వాక్సిన్ ఇవ్వడం, అంతేకాక వ్యాక్సినేషన్ పై అనుకున్న స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టని విషయాన్నికలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్నితీవ్రంగా పరిగణించిన కలెక్టర్ తక్షణమే పైన పేర్కొన్న వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు.
అంతేకాక డ్రైవ్ పై నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కానందుకు జిల్లా నెడ్ క్యాప్ అధికారి, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్, హార్టికల్చర్ ఏడిలకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆయా కేంద్రాలకు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సమీక్షించారు.
18 ఏండ్లు నిండిన వారు టీకా వేసుకునేందుకు కల్పిస్తున్న అవగాహన, డోర్ టూ డోర్ సర్వే, ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించడం అంశాలపై కలెక్టర్ అడిగి తెలసుకున్నారు. అంతేకాక టీకా కేంద్రాల వద్ద సిబ్బందికి భోజనం ఏర్పాట్లు, తాగునీరు వంటి సౌకర్యాల పై ఆరా తీశారు. 100 శాతం విజయవంతం అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి 18 ఏండ్లు నిండిన వారందరికీ తప్పనిసరిగా కనీసం ఒక్క డోసైనా వ్యాక్సిన్ ఇవ్వాలన్న స్థిరమైన లక్ష్యంతో పని చేయాలనారు. వంద శాతం టీకా పూర్తయిన చోట బ్యానర్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ఆర్డీవోలు కె స్వర్ణలత, ఆర్డీవో పద్మశ్రీ, మండల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు తదితరులు హాజరయ్యారు.