న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలపై విపరీతంగా కరోనా మహమ్మారి ప్రభావం చూపుతున్నది. ప్రజల జీవనోపాధితోపాటు వ్యాపారాలనూ దెబ్బతీస్తోంది. కొవిడ్-19 మహమ్మారి నుంచి సాధారణ పరిస్థితులు ఎప్పుడొస్తాయోనని సామాన్యుల నుంచి కార్పొరేట్ల వరకు ఎదురు చూస్తున్నారు.
2022 నాటికి కానీ పరిస్థితులు సాధారణ స్థితికి రావని అత్యధిక సంస్థల సీఈవోలు భావిస్తున్నారని కేపీఎంజీ సీఈవో నివేదిక వెల్లడించింది. అయితే ఈ ఏడాది చివరికల్లా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మరికొందరు సీఈవోలు అభిప్రాయ పడుతున్నారు.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా 500 సంస్థల సీఈవోల నుంచి కేపీఎంజీ ప్రశ్నించింది. 2022కు ముందు వ్యాపారాలు సాధారణ స్థితికి చేరే అవకాశం వస్తుందనే ఆశ లేదని 45 శాతం మంది గ్లోబల్ సీఈవోలు చెప్పారు. 31 శాతం మంది సీఈవోలు మాత్రం ఈ ఏడాది చివరికల్లా సాధారణ పరిస్థితులు వస్తాయని అంచనా వేశారు. ఈ మహమ్మారి వల్ల తమ వ్యాపార నమూనాను మార్చుకోవాల్సి వచ్చిందని 24 శాతం మంది చెప్పారు.
చాలా సంస్థల సీఈవోలు తమ ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు ఎప్పుడొస్తారోననే ఆందోళన చెందుతున్నారు. 55 శాతం మంది సీఈవోలు తమ ఉద్యోగులకు కొవిడ్-19 వ్యాక్సిన్ ఎంత త్వరగా అందుబాటులోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే తెలియజేయాలని ఉద్యోగులను కోరాలనే అంశాన్ని 90 శాతం మంది సీఈవోలు పరిశీలిస్తున్నారు.
మన దేశంలోని సీఈవోల్లో 94 శాతం మంది కరోనా వ్యాక్సినేషన్ చేయించుకున్న సమాచారం తెలియజేయాలని తమ ఉద్యోగులను కోరాలనుకుంటున్నారు. ఈ సమాచారం అందుబాటులో ఉంటే ఉద్యోగుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని భావిస్తున్నారు.
అయితే కొవిడ్-19 వ్యాక్సిన్ భద్రత విషయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి కావడం పట్ల 34 శాతం మంది సీఈవోలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటువంటి తప్పుదోవ పట్టించే సమాచారం వల్ల ఉద్యోగులు వ్యాక్సినేషన్ చేయించుకోవడం మానేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
జనాభాలో 50 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగే వరకు ఉద్యోగులను కార్యాలయాలకు పిలవకూడదని మన దేశంలోని కార్పొరేట్ సంస్థల్లోని సీఈవోల్లో 76 శాతం మంది భావిస్తున్నారు. కొవిడ్ నుంచి ఉద్యోగులకు రక్షణ ఉందన్న నమ్మకం కలిగిన తర్వాతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని వారు భావిస్తున్నారని కేపీఎంజీ గ్లోబల్ చైర్మన్ బిల్ థామస్ వెల్లడించారు.
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
పీఎస్యూల ప్రైవేటీకరణతోనే వృద్ధి రేటు పరుగులు : రాకేష్ జంఝన్వాలా
ఐసీఐసీఐ సంచలనం