ముంబై : ఎయిర్క్రాఫ్ట్ టాయిలెట్లో కస్టమ్స్ అధికారులు దాదాపు మూడు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ముంబై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఇంటలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా కస్టమ్స్ అధికారులు అంతర్జాతీయ మార్గంలో ప్రయాణిస్తున్న విమానాన్ని తనిఖీ చేసి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. టెలిఫోన్ బూత్ వంటి సాధారణ పరిమాణంలో ఉండే టాయిలెట్లో అద్దం వెనకాల ఉండే ప్లాస్టిక్ ర్యాక్లో ప్లాస్టిక్ కవర్లో దాదాపు 3 కిలోల బంగారాన్ని దాచారు. విమానం పార్కింగ్ బే వద్ద ఉండగా ఎయిర్ ఇంటలిజెన్స్ యూనిట్ అధికారులు విమానం లోపలికి వెళ్లి తనిఖీ చేశారు. మొత్తానికి అద్దం వెనుక దాచిన బంగారాన్ని కనుగొన్నారు. మొత్తం 2,932 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. బంగారం విలువ రూ.1.23 కోట్లుగా సమాచారం.