లక్నో : ఉత్తరప్రదేశ్లో కుషినగర్లోని నారాయణి నదిలో పడవలో చిక్కుకుపోయిన వారిని ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి, విజయవంతంగా రక్షించినట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ సత్యనారాయణన్ తెలిపారు. నదిలో ఇంజిన్లో సాంకేతిక లోపంతో ఓ పడవ చిక్కుకుపోయింది. ఇందులో సుమారు 150 మంది వరకు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే గోరఖ్పూర్ నుంచి ఓ బృందాన్ని పంపారు. శుక్రవారం తెల్లవారు 2.20 గంటలకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవ చిక్కుకున్న చోటుకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించి కాపాడినట్లు డీజీ తెలిపారు.
పడవ ఇరుక్కుపోయిన తర్వాత నది ప్రవాహంలో మూడు కిలోమీటర్ల వరకు అమావా దిగర్ వైపునకు వెళ్లిందని పేర్కొన్నారు. జిల్లా మెజిస్ట్రేట్తో పాటు ఎస్పీ సైతం సహాయక చర్యలను పర్యవేక్షించారు. పడవలో చిక్కుకున్న వారంతా నదికి అవతలి వైపు ఉన్న తమ వ్యవసాయ భూముల్లో పనులకు వెళ్లి తిరిగి వస్తున్నారు. పడవలో మహిళలతో పాటు పిల్లలు ఉన్నారని ఓ స్థానికుడు చెప్పాడు. సుమారు 200 మందితో ఉన్న పడవ సమీపంలోని నారాయణి నదిలో ఇరుక్కుపోయిందని, డీజిల్.. నాలుగు పడవలను ఏర్పాటు చేసి అక్కడికి చేరుకొని స్థానికుడు రింకు కుమార్ పటేల్ తెలిపాడు.
ఎన్డీఆర్ఎఫ్ వచ్చే ముందే తాము కొందరిని రక్షించామని.. కొందరు పడవలోనే చిక్కుకుపోయారని చెప్పాడు. కుషినగర్ డీఎం రాజలింగం మాట్లాడుతూ నది మధ్యలో సుమారు 200 మంది చిక్కుకున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కు సమాచారం ఇచ్చి, అందరినీ కాపాడినట్లు తెలిపారు. అయితే, నదిపై వంతెన లేకపోవడంతో పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులుపడుతున్నామని స్థానికుడొకరు పేర్కొన్నారు.